తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయంలో వివిధ వస్తువులు కొత్తవి ప్రవేశపెట్టడంతో పాటు లోపల అనేక మార్పులకు టీటీడీ శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో తాజాగా హుండీల విషయంలో టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆలయంలో పలుచోట్ల భక్తులు కానుకలు సమర్పించడానికి హుండీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు స్టీలు హుండీలను తీసుకురావాలని టీటీడీ ప్రయత్నిస్తోంది.
శనివారం ప్రయోగాత్మకంగా ఒక స్టీల్ హుండీని ఏర్పాటు చేశారు. ఐదు అడుగులు ఉన్న ఈ స్టీల్ హుండిని తీసుకెళ్లి పరిశీలించారు. ఈ స్టీల్ హుండీలో మూడు పక్కలా భక్తులు కానుకలు వేయడంతో పాటు లోపలికి చేయి దూరే అవకాశం లేకుండా మధ్యలో ఒక ఇనుప చువ్వను కూడా తయారుచేయించారు. కొన్ని రోజుల పాటు దీనిని పరిశీలించిన తర్వాత బాగుంటే మరిన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కానుకలు వేయడానికి ఈ హుండీలు చాలా సులభంగా ఉంటాయి. అంతేకాకుండా లోపలి నగదు చోరీ చేయడానికి కూడా వీలు కాదు.
అయితే ప్రస్తుతం ఉన్న హుండీలకు సంబంధించి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న హుండీలు ఓపెన్గా ఉంటాయి. దీంతో కానుకలు సమర్పించే సమయంలో కొంతమంది చేయి లోపలికి పెట్టి చోరీలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా అనేకం చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలని గత కొంతకాలంగా టీటీడీ అధికారులు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా ఈ స్టీల్ హుండీలను తీసుకొచ్చారు. ప్రస్తుతం కొప్పెరలో భారీ గంగాళాలు ఉంచి వాటిల్లో ఇత్తడి హుండీలను ఏర్పాటు చేశారు. వీటిని సిబ్బంది ట్రాలీల ద్వారా ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత లారీలో ఎక్కించి పరకామణికి తీసుకెళ్లి అక్కడ లెక్కింపు చేపడతారు. ఇలా తరలించే విషయంలో కూడా పలు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సులభంగా ఉండే స్టీలు హుండీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa