ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెరిగిన కళ్లకలక కేసులు,,,జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డాక్టర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 30, 2023, 07:05 PM

ఏపీలో కళ్లకలక కేసులు పెరుగుతున్నాయి. ప్రతి ఏటా ఈ కేసులు అక్కడక్కడా నమోదువుతున్నా.. ఈసారి మాత్రం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ కేసులు పెరిగాయి. కొద్దిరోజులుగా ఆస్పత్రులకు కళ్లకలక రోగుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖ, పార్వతీపురం మన్యం, కృష్ణా, ఉమ్మడి గుంటూరుతో పాటు పలు జిల్లాల్లో కళ్లకలక కేసులు నమోదవుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.


వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వైరస్‌లు వస్తుంటాయని.. ముఖ్యంగా ఎడినో వైరస్‌ కళ్లపైనే ప్రభావం చూపుతుందని డాక్టర్లు అంటున్నారు. కళ్లు తెరిచి ఉండటంతో దుమ్ము, ధూళి, వేడి, చలి, నీటివల్ల ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుందని.. దీనినే కళ్లకలకగా చెబుతుంటారట. సాధారణంగా బ్యాక్టీరియా వల్ల వచ్చే కళ్లకలక వారం రోజుల్లో తగ్గిపోతుంది అంటున్నారు డాక్టర్లు. వైరస్‌ వల్ల వచ్చే కళ్లకలక తగ్గేందుకు ఎక్కువ సమయం పడుతుంది అంటున్నారు.


నెలల పిల్లలు లేదంటే రోజుల పిల్లలకు వస్తే ఇబ్బంది ఉంటుందని.. మిగిలిన వారికి వారంలో తగ్గిపోతుంది అంటున్నారు. కొందరికి మాత్రం చూపు మందగించే ప్రమాదం ఉందని.. జాగ్రత్తలు అవసరం అంటున్నారు. వానాకాలంలో వాతావరణంలో ఇలాంటి వైరస్‌లు, బాక్టీరియాలు ఎక్కువగా ఉంటాయని.. అలాగే దుమ్ము, ధూళి, ప్రమాదకర వాయువులు గాలిలోనే ఉంటాయి అంటున్నారు నిపుణులు. గాలిలో ఉండే వీటి కణాలవల్ల కళ్లు ఎర్రబడతాయని.. ప్రమాదకర వైరస్‌, బ్యాక్టీరియాల కారణంగా చీము చేరే అవకాశం ఉంది అంటున్నారు.


ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా కళ్లకలక నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, గుంపుగా ఉండే ప్రదేశాల్లో కళ్లకలక వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని.. ఒక్కోసారి కొన్ని రసాయనాల వల్ల కూడా కళ్ల కలక రావొచ్చు అంటున్నారు. శుభ్రమైన నీటితో కళ్లను కడగడంవల్ల అది తగ్గిపోతుందని.. లక్షణాలు తీవ్రంగా ఉండే వ్యక్తి ముక్కులో, సైనస్‌లో ఉండే వైరస్‌, బాక్టీరియా ఇతరుల కళ్లలోకి చేరితే ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. షుగర్ ఉన్నవారు, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు కళ్లకలక వస్తే జాగ్రత్తగా ఉండాలంటున్నారు.


ప్రధానంగా బ్యాక్టీరియా బీ వైరస్‌ బీ కెమికల్‌ కారణాలుగా చెబుతున్నారు. కన్ను ఎర్రగా మారడం.. కొందరికి కంటి నుంచి నీరు కారుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కొంతమందికి కంటి రెప్పలు ఉబ్బిపోయే ప్రమాదం ఉందంటున్నారు. కళ్లకలక కారణంగా నిద్రపోయినప్పుడు కను రెప్పలు అంటుకుపోతాయని.. పుసి రావటం, కంటి నొప్పి, దురద, మంట వంటి లక్షణాలు ఉంటాయంటున్నారు. కళ్లకలక వచ్చిన వారికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇతరులు వాడే వస్తువులను తాకకూడదు.. కళ్ల కలక ఉన్నవాళ్లు కళ్లజోడు వాడటం మంచిది. సొంత ట్రీట్మెంట్ వద్దని.. అవసరమైన సందర్భంలో డాక్టర్లను సంప్రదించాలంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa