ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అహ్మదాబాద్‌ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Sun, Jul 30, 2023, 10:07 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బహుళ అంతస్తుల ఆస్పత్రి భవనం బేస్‌మెంట్‌లో తొలుత మంటలు చెలరేగాయి. షహీబౌగ్ ప్రాంతంలో ఉన్న రాజస్థాన్ ఆస్పత్రిలో ఉదయం 4.30 గంటలకు మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న 100 మంది రోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి.. మరో ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.


అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పుతున్న సిబ్బంది.. ఆస్పత్రిలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకొచ్చారు. ‘మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.. మంటలు చెలరేగిన ఆసుపత్రి బేస్‌మెంట్ నుంచి పొగలు వస్తూనే ఉన్నాయి’ అని షహీబౌగ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ చంపావత్ తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా దాదాపు 100 మంది రోగులను బహుళ అంతస్తుల భవనం నుంచి ఖాళీ చేయించినట్టు పేర్కొన్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన ఆస్పత్రిని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టామని తెలిపారు. తొలుత భవనం బేస్‌మెంట్‌లో మంటలు చెలరేగినట్టు పోలీసులు వివరించారు. లోపల ఎవరైనా ఇంకా చిక్కుకున్నారా? గాయపడ్డారా? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa