ప్రభుత్వ శాఖల సేవల్లో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని 2005లో తీసుకువచ్చింది. ఈ చట్టం కింద ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సమాచారాన్ని అడిగిన పౌరులకు సంబంధిత అధికారులు చెప్పాల్సి ఉంటుంది. లేని పక్షంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటారు. అయితే.. ఇలాగే సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగిన ఓ వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. ఎందుకంటే అతడు అడిగిన ప్రశ్నకు అధికారులు ఏకంగా 40 వేల పేజీల సమాధానాన్ని ఇచ్చారు. దీంతో వాటిని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆ వ్యక్తి ఏకంగా ఓ కారునే తీసుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. అటు.. ఇన్ని పేజీల సమాచారాన్ని ఆ పౌరుడికి ఉచితంగా అందించడంతో ప్రభుత్వానికి కూడా భారీగానే నష్టం జరిగింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ధర్మేంద్ర శుక్లా నెల రోజుల క్రితం సమాచార హక్కు చట్టం కింద ఒక దరఖాస్తు చేశాడు. కరోనా సమయంలో ఔషధాలు, పరికరాలు, మెటీరియల్ సరఫరాకు సంబంధించిన టెండర్లు, వాటి బిల్ పేమెంట్స్ వివరాలు ఇవ్వాలని స్థానిక చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్కు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. అయితే శుక్లా దరఖాస్తు చేసి నెల రోజులు దాటినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో విసుగు చెందిన ధర్మేంద్ర శుక్లా ఉన్నతాధికారులను సంప్రదించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులైన స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ జాయింట్ ఆఫీసర్, ఫస్ట్ అప్పీలేట్ ఆఫీసర్ డాక్టర్ శరద్ గుప్తాకు కిందిస్థాయి ఉద్యోగులపై శుక్లా ఫిర్యాదు చేశారు.
దీంతో స్పందించిన ఉన్నతాధికారుులు ఆర్టీఐ దరఖాస్తును స్వీకరించడంతో పాటు దానికి సంబంధించిన సమాచారాన్ని ఉచితంగా ధర్మేంద్ర శుక్లాకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సమాచారం కోసం ఆఫీస్కు వెళ్లిన ధర్మేంద్ర శుక్లాకు షాక్ తగిలింది. ఎందుకంటే అతడు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను అధికారులు మొత్తం 40 వేల పేజీల్లో ఇచ్చారు. దీంతో వాటిని తన ఇంటికి తీసుకువెళ్లేందుకు ఏకంగా అతని కారు నిండిపోయింది. కారులో కేవలం డ్రైవర్ సీటు మాత్రమే ఖాళీగా మిగిలిందని తెలిపారు. సాధారణంగా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే.. సంబంధిత పేపర్ ప్రింటింగ్ డబ్బులు దరఖాస్తుదారుడే చెల్లించాల్సి ఉంటుంద. అయితే సమాచారాన్ని నిర్ణీత సమయంలో ఇవ్వకపోవడంతో ఉచితంగా ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. దీంతో పేజీకి రూ. 2 చొప్పున మొత్తం ప్రభుత్వానికి రూ.80 వేలు నష్టం జరిగింది. దీంతో మరోసారి స్పందించిన ఉన్నతాధికారులు.. ఈ ఘటనకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa