తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉందని చెప్పారు. ఈ సారి అధిక మాసం సందర్భంగా వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఒకేసారి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణం ఉంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. రెండు సార్లు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారి ఆలయంలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని.. ఇక, అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 22న గరుడ సేవ, 23న స్వర్ణరథ ఉరేగింపు ఉంటాయని.. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖల స్వీకరణపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని వెల్లడించారు. వెనుకబడ్డ ప్రాంతాలకు చెందిన 10 వేల మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తామని పేర్కొన్నారు. గరుడ సేవ రోజున తిరుమల చేరుకున్న భక్తులందరికీ స్వామి వారి దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కొన్ని రోజుల క్రితం వరకూ శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురు చూసేవారు. కానీ, ప్రస్తుతం ఇప్పుడు భక్తులు వేచి ఉండకుండా నేరుగా స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa