ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై ,,,ఆగస్టు 8, 9, 10 వ తేదీల్లో చర్చ

national |  Suryaa Desk  | Published : Tue, Aug 01, 2023, 09:14 PM

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ అంశంపై ఇరు సభలు వాయిదాలతోనే కాలం వెళ్లదీస్తున్నాయి. మణిపూర్‌లో మహిళలపై జరిగిన అమానవీయ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వాలని పట్టుబడుతుండగా.. స్వల్ప కాలిక చర్చ చేపడతామని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో పార్లమెంటులో ప్రతిష్ఠంభన వీడటం లేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. మణిపూర్ ఘటనపై బదులు ఇస్తారని కేంద్రం చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు.. ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే చివరి అస్త్రంగా ప్రతిపక్షాలు.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా ఆమోదించగా.. లోక్‌సభ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించి.. తేదీలు ఖరారు చేసింది. ఆగస్టు 8వ తేదీ నుంచి 3 రోజులపాటు అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో చర్చ జరగనుంది. చివరి రోజైన ఆగస్టు 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పనున్నారు.


అయితే ఈ అవిశ్వాస తీర్మానంతో మోదీ సర్కారు కూలిపోయే పరిస్థితి లేనేలేదు. అయితే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. అందులో మెజారిటీ ఓట్లు సాధించలేమని తెలిసినప్పటికీ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి. దీనికి కారణం.. మణిపూర్ ఘటనలపై ప్రధాని మోదీని సమాధానం చెప్పించాలని నిర్ణయించుకున్నాయి. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే లో‌క్‌సభలో అధ్యక్షుడిగా ప్రధాని నరేంద్ర మోదీ దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని విపక్షాలు ఉపయోగించుకున్నాయి. అయితే అధికార ఎన్డీఏ కూటమికి లోక్‌సభలో పూర్తి మెజార్టీ ఉంది. అటు.. విపక్షాల కూటమి ఇండియాకు కేవలం 144 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.


అయితే తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ.. దానిపై చర్చ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ప్రతిపక్షాలు.. అధికార పక్షంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ విమర్శలపై స్పందించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. ప్రతిపక్షాల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ మోదీ సర్కార్‌కు ఉందని స్పష్టం చేశారు. బిల్లులను ప్రవేశపెట్టడానికి ముందే అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టాలనే నిబంధన ఏమీ లేదని.. 10 రోజుల్లోగా ఎప్పుడైనా చేపట్టవచ్చని పీయూష్ గోయల్ వెల్లడించారు.


3 నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రెండు జాతుల మధ్య తీవ్ర హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందురోజు.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. అందులో ఒక మహిళపై అత్యంత దారుణంగా గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మణిపూర్ పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై సీరియస్ అయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa