ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.2వేల కోట్లు ఉన్నట్లు నిరూపించాలి,,,,చంద్రబాబుకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి సవాల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2023, 06:54 PM

రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ప్రాజెక్టులు పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబుకు ఎప్పుడూ లేదని.. బాబు శిలాఫలాకాలు వేయడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. తనకు రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.. తనకు రూ.50 కోట్లిస్తే చాలు.. మిగిలిన ఆస్తులన్నీ రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తన దగ్గర ఉందంటున్న రూ.1950 కోట్లతో రాప్తాడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తారా అంటూ సవాల్ విసిరారు.


చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. పాల డైరీ, బోరు బావుల ద్వారా ప్రజలకు సేవ అందిస్తున్నామని.. చంద్రబాబు బెదిరింపులకు భయపడే సమస్య లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే గుండు కొట్టించుకుంటానన్నారు. హెరిటేజ్ ద్వారా రైతుల నుంచి రూ.25 వేల కోట్లు చంద్రబాబు దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. విజయ డెయిరీని చంపేసిన ఆర్థిక ఉగ్రవాది.. సహకార వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకార వ్యవస్థను గాడిన పెడుతున్నారన్నారు.


చంద్రబాబు రైతుల రక్తాన్ని పీల్చిన రక్త పిశాచని.. అమరావతిని రియల్‌ ఎస్టేట్‌ దందాగా మార్చారన్నారు. బాబు బినామీలతో అమరావతిలో భూములు కొనిపించారు.. ఇళ్ల నిర్మాణం గురించి బాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణంతో పేదల కల నెరవేరుతోందని.. చంద్రబాబులా పేదలను దోచుకునే అలవాటు తమకు లేదన్నారు. ప్రజలను దోచుకున్నదెవరో అందరికీ తెలుసన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌లో ఫ్యాక్షన్ బాధితుల పిల్లలను చదివించి ఫ్యాక్షన్ చేయిస్తున్నారని.. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్‌లో క్రిమినల్స్‌ను తయారు చేసే అడ్డా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ చదువుకున్న వారు కేసుల్లో ఉన్నారన్నారు.


చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారో చెప్పాలన్నారు. రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని.. చంద్రబాబు రాయలసీమ వ్యతిరేకి అన్నారు. ఆయన ఒక్క ప్రాజెక్టునైనా కట్టారా అని ప్రశ్నించారు. రాయలసీమ జిల్లా అభివృద్ధి గురించి బాబు ఏరోజైనా ఆలోచించారా.. ఎన్నికలొస్తున్నప్పుడే బాబుకు ప్రాజెక్టులు గుర్తుకొస్తాయన్నారు.


వైఎస్సార్ జలయజ్ఞం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారని.. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరిస్తే బాబు వ్యతిరేకించారని విమర్శించారు. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు విస్తరణ వల్లే రాయలసీమకు సాగు, తాగు నీటి కష్టాలు తీరాయన్నారు. 1996, 1999లో రెండు సార్లు హంద్రీనీవా ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఎందుకు పనులు చేయలేదో చెప్పాలన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాకే హంద్రీనీవా, గాలేరు-నగరి సహా రాయలసీమ ప్రాజెక్టులకు మోక్షం లభించిందన్నారు.


40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను ఐదు టీఎంసీలకు చంద్రబాబు కుదించి సీమకు అన్యాయం చేశారన్నారు. కరవు ప్రాంతాలకు కృష్ణా జలాలు వైఎస్సార్ పుణ్యమేనని.. చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కూ.వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని ఆరోపించారు. సీఎం జగన్‌ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందని.. పెండింగ్ ప్రాజెక్టులను సీఎం జగన్ చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నారన్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓడిపోబోతున్నారని.. ఆ భయంతోనే చంద్రబాబు అండ్ కో దొంగ ఓట్ల డ్రామాలాడుతున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa