భారత వీసా కోసం ప్రయత్నించి విఫలమైన ఓ పాకిస్థాన్ మహిళ.. రాజస్థాన్కు చెందిన వ్యక్తిని వర్చువల్గా వివాహం చేసుకుంది. పబ్జీలో పరిచయమైన నొయిడా యువకుడ్ని వివాహం చేసుకోవడానికి పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో భారత్లోకి చొరబడినప్పటి నుంచి సీమాంతర వివాహాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా, జోధ్పూర్కు చెందిన చార్జెట్ అకౌంటెంట్ అర్బాజ్ ఖాన్కి.. కరాచీకి చెందిన అమీనా అనే యువతితో పెళ్లి నిశ్చయంకాగా.. భారత్లో పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అమీనాకు భారత్ వీసా కోసం ప్రయత్నించగా.. అనుమతి రాలేదు. దీంతో ముందుగా అనుకున్న తేదీ ప్రకారం బుధవారం వర్చువల్గా నిఖా జరిపించారు.
‘అమీనా వీసా కోసం దరఖాస్తు చేయనుంది.. నేను పాకిస్థాన్ వెళ్లి పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే దానికి గుర్తింపు ఉండదు.. ఆమె భారత్ చేరుకున్న తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలి’ అని అర్బాజ్ అన్నారు. బుధవారం జోధ్పూర్లో ఓస్వాల్ సమాజ్ భవన్కు బంధువులు, స్నేహితులతో చేరుకున్న అర్బాజ్ ఖాన్.. అమీనాను వర్చువల్గా నిఖా చేసుకున్నారు. కేవలం నిఖా మాత్రమే కాకుండా కుటుంబం వేడుకల్లో మునిగిపోయి, అర్బాజ్కి సంప్రదాయబద్దంగా అన్ని కార్యక్రమాలను నిర్వహించింది. జోధ్పూర్ ఖాజీ ఆధ్వరంలో ఈ నిఖా జరిగింది. నూతన దంపతులను ఆయన ఆశీర్వదించారు.
అమీనాతో బంధం గురించి అర్బాజ్ మాట్లాడుతూ.. తమది పెద్దలు కుదిర్చిన వివాహమని చెప్పారు. పాకిస్థాన్లోని తమ బంధువుల ద్వారా ఈ సంబంధం కుదిరిందని తెలిపారు. ‘మా కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఏర్పాట్లు చేశారు.. ఆన్లైన్లో నిఖా చేయడానికి ఈ రోజుల్లో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండటమే కారణం’ అని అర్బాజ్ వ్యాఖ్యానించాడు. వీసా లభించిన తర్వాత అమీనా భారత్కు వస్తుందని, తర్వాత మరోసారి తమ ఆచారం ప్రకారం వివాహం చేసుకుంటామని తెలియజేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa