ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారికి భారీ విరాళం,,,,డీడీని అందజేసిన శేఖర్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 07, 2023, 08:44 PM

తిరుమల శ్రీవారికి భక్తుల నుంచి భారీ విరాళం అందింది. టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది మంది దాతలు రూ.5.11 కోట్లను అందజేశారు. దీనికి సంబంధించిన డీడీని దాతలతో కలిసి.. అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ విరాళాన్ని చెన్నై టీ నగర్ వెంకటనారాయణ రోడ్డులోని వెంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ కోసం అవసరమైన భూమిని కొనుగోలు చేసేందుకు అందజేసినట్లు తెలుస్తోంది.


అంతేకాదు ఏజే శేఖర్ రెడ్డి ఆలయానిక సమీపంలో భూమిని కూడా గుర్తించారు. ఈ భూమిని కొనుగోలు చేసేందుకు మరికొందరు దాతలు రూ. 8,15,15,002 లను అందజేశారు. ర్యాపిడ్ కేర్ జీఆర్పీ సంస్థ, వెంకట సుబ్రహ్మణ్యం కుటుంబం, నాగార్జున కుటుంబం, కోయంబత్తూరుకు చెందిన సీఆర్ సంస్థ, శ్రీశరన్, షణ్ముగ మూర్తి, నరేష్ సుబ్రహ్మణ్యం, బల్చా కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, నీలాద్రి ప్యాకింగ్స్‌లు ఈ విరాళాన్ని అందజేశారు.


మరోవైపు తిరుమల శ్రీవారిని టీటీడీ నూతన పాలక మండలి ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి దర్శించుకున్నారు. నూతన టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించిన తర్వాత తొలిసారి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొనిఆశీర్వాదం పొందారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.


ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని నూతన పాలక మండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఇవాళ జరిగిన పాలకమండలి సమావేశంలో నూతన పాలక మండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. ఈనెల 10న భూమన టీటీడీ నూతన పాలక మండలి చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa