ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు బంపరాఫర్. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 50 శాతం రిబేటుపై చేనేత వస్త్రాలను అందించనున్నారు. సచివాలయంలోని ఆప్కో విక్రయ శాల ద్వారా ఈ నెలాఖరు వరకు విక్రయించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ కె సునీత ప్రకటించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హుందాతనాన్ని, గౌరవాన్ని, ఆరోగ్యాన్ని కల్పించే చేనేత వస్త్రాలను ఉద్యోగులు అంతా విరివిగా ధరిస్తూ చేనేత కార్మికులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సునీత పిలుపునిచ్చారు.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా వైఎస్.రాజశేఖర్ రెడ్డి చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఉద్యోగులు ప్రతి శనివారం చేనేత వస్త్రాలను తప్పని సరిగా ధరించాలనే విదానాన్ని అమలు పర్చారన్నారు. అయితే శనివారం సెలవు దినం అవ్వడం వల్ల ఆ సాంప్రదాయం గాడి తప్పిందన్నారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇకపై ప్రతి శుక్రవారం ఉద్యోగులు అంతా చేనేత వస్త్రాలను ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. చేనేత వస్త్రాలు ఎంతో సౌకర్య వంతంగా ఉంటాయని, పురాతన కాలం నుండి చేనేత వస్త్రాలను ధరించడ మనేది మన సాంప్రదాయంగా కొనసాగుతుందన్నారు. ఉద్యోగులు అంతా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో 90 విక్రయ శాలలను ఏర్పాటు చేశామన్నారు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ ఎం.ఎం.నాయక్. వినియోగదారులను ఆకర్షించే విధంగా నూతన డిజైన్లతో పలు వస్త్రాలను ఆ విక్రయ శాలల ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు 3 నుంచి 5 వాయిదాల్లో కొనుగోలు సొమ్మును చెల్లించేదుకు అవకాశం కల్పించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చేనేత కార్మికులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత చొరవతోనే సచివాలయం ఆవరణలో ఆప్కో విక్రయ శాలను ఏర్పాటు చేశారని.. ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటరామిరెడ్డి. చేనేత వస్త్రాలు ధరించేందుకు ఉద్యోగులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో చేనేత వస్త్రాలు ధరించిన మహిళా, పురుష ఉద్యోగులను లాటరీ ద్వారా ఎంపిక చేసి వారికి బహుమతులను అందజేశారు. సచివాలయ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa