తమ గుర్తింపును దాచిపెట్టి మోసపూరితంగా మహిళను వివాహం చేసుకుంటే పదేళ్ల వరకూ జైలు శిక్ష విధించే కొత్త చట్టాన్ని కేంద్రం తీసుకొస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు శుక్రవారం తీసుకొచ్చింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)1860 స్థానే భారతీయ న్యాయ సంహిత బిల్లు 2023ను తీసుకొచ్చినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. బీఎన్ఎస్ బిల్లు ప్రకారం తప్పుడు వాగ్దానాలతో తమ గుర్తింపును దాచిపెట్టి మోసపూరితంగా మహిళను వివాహం చేసుకున్నా లేదా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నా పదేళ్ల వరకు జైలు శిక్షకు అర్హులు.
‘మహిళలపై నేరాలు, వారు ఎదుర్కొంటున్న అనేక సామాజిక సమస్యలను ఈ బిల్లులో ప్రస్తావించారు.. వివాహం, ఉద్యోగం, పదోన్నతి వంటి తప్పుడు వాగ్దానాలతో మొదటిసారి మహిళలతో సంభోగం నేరంగా పరిగణిస్తారు’’ అని హోం మంత్రి ఆయన అన్నారు. పెళ్లి పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడినట్లు మహిళలు దాఖలు చేసిన కేసులను కోర్టులు విచారించినప్పటికీ.. ఐపీసీలో దీనికి నిర్దిష్ట నిబంధన లేదు.
ప్రస్తుతం పార్లమెంట్ ముందుకొచ్చిన ఈ బిల్లు ఇలా పేర్కొంది: ‘ఎవరైనా, మోసపూరిత మార్గాల ద్వారా లేదా దానిని నెరవేర్చాలనే ఉద్దేశం లేకుండా ఒక మహిళను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసి, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అత్యాచారం నేరం కింద పదేళ్ల వరకు జైలు శిక్.. జరిమానా కూడా విధిస్తారు..’
ఇది లైంగిక నేరాల బాధితుల వాంగ్మూలాలను తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయడానికి, ఛార్జిషీట్లను దాఖలు, విచారణలను పూర్తి చేయడానికి కాల పరిమితులను విధించడం, అలాగే పరారీలో ఉన్న నేరస్థుల కోసం విచారణ నిర్వహించడం వంటి వాటిని కూడా అందిస్తుంది.
ఈ బిల్లుపై సీనియర్ క్రిమినల్ లాయర్ శిల్పి జైన్ మాట్లాడుతూ.. ఈ నిబంధన చాలా కాలం గడిచిపోయిందని, అలాంటి నిబంధన లేకపోవడం వల్ల కేసులను నేరంగా పరిగణించడం లేదని అన్నారు. ‘పెళ్లి చేసుకుంటానని చెప్పి వారితో సెక్స్లో పాల్గొనే పురుషులు మన దేశంలో మహిళలను దోపిడీకి గురిచేస్తున్నారని... వాగ్దానం చేసే సమయంలో పురుషులకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుంటే అది నేరం’ అని ఆమె పేర్కొన్నారు.
అత్యాచార బాధితురాలు చనిపోయినా లేదా మతిస్థిమితం కోల్పోయినా దోషికి 20 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జీవిత ఖైదు విధించబడుతుంది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడే వ్యక్తికి తక్కువలో తక్కువగా 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది. .గ్యాంగ్ రేప్ కేసుల్లో శిక్షను పెంచామని, ఇప్పుడు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడే అవకాశం ఉందని హోం మంత్రి తెలిపారు. ‘18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలకు సంబంధించిన కేసులలో ఉరిశిక్ష విధించబడుతుంది’ అని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa