సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనాల నుంచి ఎదురయ్యే సవాళ్లను తిప్పికొట్టడానికి శ్రీనగర్ ఎయిర్ బేస్లో అప్గ్రేడ్ చేసిన మిగ్-29 ఫైటర్ జెట్ల స్క్వాడ్రన్లను భారత్ మోహరించింది. ‘డిఫెండర్ ఆఫ్ ది నార్త్’గా గుర్తింపు పొందిన ట్రైడెంట్స్ స్క్వాడ్రన్... సాంప్రదాయకంగా పాకిస్థాన్ నుంచి వచ్చే ప్రమాదాలను నివారించే శ్రీనగర్ వైమానిక స్థావరంలోని మిగ్-21 స్క్వాడ్రన్ స్థానంలో వీటిని ప్రవేశపెట్టారు. ‘కశ్మీర్ లోయ మధ్యలో శ్రీనగర్ ఉంది.. మైదానాల కంటే ఎత్తులో ఉంది. సరిహద్దుకు సమీపంలో ఉన్నందున ఎక్కువ బరువు సామర్థ్యం నిష్పత్తి.. దీర్ఘశ్రేణి క్షిపణులు, ఆయుధాలతో వేగంగా ప్రతిస్పందించే విమానాన్ని ఉంచడం వ్యూహాత్మకంగా ఉత్తమం.. మిగ్-29 ఈ ప్రమాణాలన్నింటినీ నెరవేరుస్తుంది.. దీని సాయంతో మేము రెండువైపుల నుంచి శత్రువులను ఎదుర్కోగలం’ అని భారత వైమానిక దళ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ విపుల్ శర్మ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.
కశ్మీర్ లోయను చాలా ఏళ్ల నుంచి రక్షిస్తున్న మిగ్-21 కంటే మిగ్- 29లో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. 2019లో బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత ఉగ్రవాద శిబిరాలపై దాడి, పాక్ F-16లను కూల్చివేతలో కీలకంగా వ్యవహరించాయి. ఆధునీకరించిన MiG-29 గాలి నుంచి గాల్లోకి.. ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే దీర్ఘ-శ్రేణి క్షిపణులు, ఆయుధాలు, అత్యవసర సమయంలో సాయుధ దళాల ఉపయోగానికి ప్రభుత్వం అందజేసిన శక్తివంతమైన ఆయుధాలు కూడా ఉన్నాయి.
‘సరిహద్దుల్లో ప్రతిష్టంభన సమయాల్లో శత్రు విమానాలను ఛేదించగల సామర్థ్యం కూడా ఈ యుద్ధ విమానాలకు ఉంది’ అని అధికారులు తెలిపారు. పైలట్ స్క్వాడ్రన్ లీడర్ శివమ్ రాణా మాట్లాడుతూ.. అప్గ్రేడ్ చేసిన విమానం నైట్ విజన్ గాగుల్స్తో రాత్రిపూట పనిచేయగలదని, గాల్లోనే ఇంధనం నింపే సామర్థ్యం కారణంగా దీర్ఘకాలిక శ్రేణిని కలిగి ఉంటుందని చెప్పారు.
‘ఇంతకు ముందు లేని గాల్లో నుంచి భూమిపైకి ప్రయోగించే ఆయుధాలను కూడా వీటికి చేర్చాం. ఈ విమానాలను నడిపే భారత వైమానిక దళం ఎంపిక చేసి పైలట్లే దీనికి అతిపెద్ద సామర్ధ్యం’ అని ఆయన చెప్పారు.మిగ్-29లను ఈ ఏడాది జనవరిలో శ్రీనగర్ ఎయిర్ బేస్కి తరలించగా.. లడఖ్ సెక్టార్తో పాటు కశ్మీర్ లోయలో విస్తృతంగా ప్రయాణించాయి. ఒకవేళ, చైనా గగనతల ఉల్లంఘనకు ప్రయత్నిస్తే మొదట ప్రతిస్పందించే భారత సైన్యం యుద్ధ విమానాల్లో ఇవి ఒకటి. 2020 నాటి గాల్వాన్ ఘర్షణ తర్వాత చైనా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొడానికి లడఖ్ సెక్టార్లో మోహరించిన మొదటి విమానం మిగ్ -29. అప్పటి నుంచి అలాంటి అనేక ప్రయత్నాలను ఈ విమానం అడ్డుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa