కాలేజీ రోజుల్లో ఇద్దరు యవతీ యవకులు ప్రేమించుంకుంటారు. అయితే ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో వారు విడిపోతారు. కాలం చక్రం గిర్రున తిరుగుతుంది. అప్పటికే ఆ యువతికి పెళ్లిపోతుంది. అయినా సరే.. ప్రియడు ఆమెను మరిచిపోలేక.. ఆమెను ఎత్తుకెళ్లిపోయి మళ్లీ పెళ్లి చేసుకుంటాడు. కొన్ని తెలుగు సినిమాల్లో రోటీన్గా కనిపించే సీన్లు ఇవి. కానీ నిజజీవితంలోనూ ఇలాగే జరిగితే..! అది కూడా అబ్బాయిని అమ్మాయి ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటే..!! అవునండీ తమిళనాడులోని చెన్నైలో అదే జరిగింది.
చెన్నై సిటీలో అప్పటికే పెళ్లైన ప్రియుడిని ఓ యువతి కిడ్నాప్ చేసింది. అనంతరం ఓ టెంపుల్కు తీసుకెళ్లి బలవంతంగా తాళి కట్టించుకుంది. సదరు వ్యక్తి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతితో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై వేళచ్చేరికి చెందిన ఐటీ ఉద్యోగి పార్తిబన్, రాణిపేటకు చెందిన సౌందర్య కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకొని సినిమాలకు, షికార్లకు తిరిగారు. ఏడేళ్ల ప్రేమ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో తమ లవ్కు బ్రేకప్ చెప్పారు.
చాలా కాలంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకోవటం లేదు. లవ్ బ్రేకప్ కావటంతో మరో పెళ్లి చేసుకునేందుకు పార్తిబన్ సిద్ధమయ్యాడు. జులై 5న ఐటీ ఉద్యోగం చేసే మరో యువతిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న సౌందర్య.. పార్తిబన్ను మర్చిపోలేకపోయింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని తన తల్లి, బంధువులతో తెగేసి చెప్పింది. కూతురు వేదనను అర్ధం చేసుకున్న ఆమె తల్లి ఉమ, బంధువులు రమేష్, శివకుమార్ల సాయంతో పార్తిబన్ కిడ్నాప్నకు స్కెచ్ వేశారు.
ఆగస్టు 11న ఎప్పటిలాగానే ఆఫీస్కు బయల్దేరిన పార్తిబన్ని కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. నేరుగా కాంచీపురంలోని ఓ టెంపుల్కు తీసుకెళ్లి సౌందర్య మెడలో బలవంతంగా తాళి కట్టించారు. కిడ్నాప్ విషయం తెలుసుకున్న పార్తిబన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించారు. సౌందర్యతో పాటు యువకుడి కిడ్నాప్కు సహకరించిన బంధువులను అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa