సికింద్రాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరిన హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో దోపిడీకి పాల్పడిన దొంగలు ఉలవపాడు - తెట్టు స్టేషన్ల మధ్య ఉన్న వీరేపల్లి తిప్ప సమీపంలో చైను లాగి రైలును ఆపి పరారయ్యారు. ఏ-1 ఏసీ బోగి, ఎస్-4, ఎస్-5 స్లీపర్ కోచ్లలో ప్రయాణికులను కత్తులతో బెదిరించి నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్నారు. రైలు వీరేపల్లి సమీపించగానే చైను లాగి ఆపేసి దిగి పరారయ్యారు. అర్ధరాత్రి 1.25 గంటల ప్రాంతంలో వీరేపల్లి వద్ద రైలు ఆగగా, 1.47 గంటల ప్రాంతంలో అక్కడ నుంచి రైలు బయలుదేరింది. జరిగిన ఘటనపై ప్రయాణికులు కావలి స్టేషన్లో దోపిడీపై సమాచారం ఇవ్వడమేగాక తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేసినట్లు సమాచారం. కాగా, వీరేపల్లి వద్దే వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో వచ్చే ఛార్మినార్ ఎక్స్ప్రెస్లో కూడా దోపిడీకి విఫలయత్నం చేశారు. అంటే రమారమి 2 గంటలపాటు దొంగలు ఆ ప్రాంతంలోనే ఉన్నారనేది రూఢీ అవుతోంది. వీరేపల్లి ప్రాంతం ట్రాక్డ్రాప్ ప్రాంతంగా ఉండటంతో ఇక్కడ ఒక్కోసారి సిగ్నల్స్ సరిగా అందవని దీంతో ముందు ట్రాక్పై రైలు ఉన్నట్లుగా రెడ్సిగ్నల్ పడటంతో మూడున్నర గంటల ప్రాంతంలో చార్మినార్ ఎక్స్ప్రెస్ను లోకోపైలెట్ ఆపడం, ఆ వెంటనే దొంగలు రైల్లోకి ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. కర్రలు, రాడ్లతో బోగీలను బాదుతూ తలుపులు తీయమని నానా హడావిడి చేయగా తలుపులన్నీ మూసి ఉండటంతో వారి ప్రయత్నం ఫలించలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే 1.25 ప్రాంతంలో హైదరాబాద్ ఎక్స్ప్రెస్లోంచి దిగిన దొంగలు రెండు గంటలపాటు అక్కడే ఉన్నారంటే చార్మినార్ కూడా అక్కడ ఆగుతుందని వారికి అంచనా ఉన్నట్లేనని అంటే సిగ్నల్ వ్యవస్థపై అవగాహన ఉన్నవారు ఈ ముఠాలో ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. సడన్గా చార్మినార్ ఎక్స్ప్రెస్ ఆగిపోవటంతో ఆ వెనుక వస్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ను చాగొల్లు వద్ద, మరో స్పెషల్ ట్రైన్ను ఉలవపాడు స్టేషన్లోను దాదాపు గంటపాటు రైల్వే అధికారులు నిలిపివేయాల్సి వచ్చింది. ఇంత జరిగినా దోపిడీ దొంగలు మాత్రం క్షేమంగా పరారయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa