ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు,,,జాతీయ జెండాను ఎగురవేసిన టీటీడీ ఛైర్మన్ భూమన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 15, 2023, 07:13 PM

సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు కృషి చేస్తామన్నారు టీటీడీ పాలకమండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఉద్యోగులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు అందజేస్తామని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో మంగళవారం ఘనంగా జరిగాయి. భూమన కరుణాకర్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి.. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. శ్రీమహా విష్ణువు స్వయంభుగా వెలసిన ప్రదేశం తిరుమల. టీటీడీలో సేవలందించడం ఉద్యోగుల జన్మజన్మల పుణ్యఫలం. హిందూ ధర్మాన్ని పాటించే హిందువులందరికీ టీటీడీ పెద్దదిక్కుగా నిలుస్తోంది అన్నారు.


ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగా నేడు మనమంతా బానిస సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామన్నారు. ఆ మహానుభావుల బలిదానాలను నిత్యం మననం చేసుకుంటూ.. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వాలు నెలకొల్పడానికి ప్రతి ఒక్కరు అకుంఠిత దీక్షతో పని చేయాలన్నారు. ఇదే స్ఫూర్తితో టీటీడీలోని అధికారులు, ఉద్యోగులందరూ భక్తుల సేవలో తరించాలని కోరుతున్నాను అన్నారు. హైందవ సనాతన ధర్మవ్యాప్తికి ఆళ్వారుల కాలం నుంచి ఇప్పటివరకు టీటీడీ ఎన్నో సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది అన్నారు. దర్శనంతో సంబంధం లేకుండా కొండ మీదకు వచ్చిన ప్రతి భక్తుడు రెండు పూటల కడుపు నిండా భోజనం చేసే అవకాశం టీటీడీ కల్పించిందన్నారు.


సర్వదర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక చిన్న లడ్డూ ఇచ్చే కార్యక్రమం టీటీడీ ప్రారంభించిందన్నారు. మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారితో పాటు శ్రీదేవి, భూ దేవిని దళితవాడలకు తీసుకెళ్ళి అక్కడే కళ్యాణం నిర్వహించి వారికి స్వామివారి ఆశీస్సులు అందజేసే దళిత గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అన్నారు. భగవంతుడిని భక్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆశీస్సులు అందించేలా.. స్వామివారి కల్యాణాన్ని వారంతా చూసి ఆనందించేలా శ్రీనివాస కళ్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించింది.


పిల్లల పెళ్లిళ్లకు అప్పులు చేసి ఆర్థికంగా చితికి పోతున్న పేద, మధ్య తరగతి వర్గాల వారికి చేయూతనివ్వడానికి నిర్వహించిన కార్యక్రమమే కళ్యాణమస్తు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 32 వేలకు పైగా జంటలకు స్వామివారి సమక్షంలో పెళ్లిళ్లు చేసి ఆయన ఆశీస్సులు అందింపజేసిందన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని, సనాతన హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఛానల్ కు ప్రస్తుతం 8 కోట్ల మంది వీక్షకులు ఉన్నారన్నారు.


దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంపూర్ణ సహకారంతో వేద పరిరక్షణకు టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశీస్సులతో అర్హులైన ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చామన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆశీస్సులతో అర్హులైన ఉద్యోగులందరికీ త్వరలో ఇంటి స్థలాలు ఇస్తామన్నారు. ఇందుకోసం 430 ఎకరాల స్థల సేకరణ పూర్తయిందన్నారు.  ఇవాళ తాను ఈవోతో కలిసి వడమాల పేట దగ్గర ఉద్యోగులకు కేటాయించిన భూమి పరిశీలనకు వెళుతున్నాను అన్నారు. వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇంటి స్థలాలు అందిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa