ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటివరకు వర్షాలతో 300 మందికిపైగా మృత్యువాత,,,,వరద నష్టం రూ.10వేల కోట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 16, 2023, 09:18 PM

జూన్ - జులై నెలల్లో ప్రారంభమైన వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ను ఇంకా వీడటం లేదు. ఎప్పుడూ లేని భారీ వర్షాలు, వరదలు ఆ రాష్ట్రాన్ని కోలుకోనీయకుండా చేస్తున్నాయి. జులైలో సంభవించిన జల ప్రళయం తగ్గకముందే ఇటీవల అక్కడ మరోసారి కుండపోత వర్షాలు, భీకర వరదలు.. వణికించాయి. కొండ చరియలు విరిగిపడి భవనాలు, ఇళ్లు, దేవాలయాలు నేలమట్టం అయ్యాయి. విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. జాతీయ రహదారులు సహా రోడ్లన్నీ కొండ చరియల ధాటికి మూసుకు పోవడంతో రాకపోకలు స్తంభించి.. జనజీవనం ఎక్కడిక్కడ చిక్కుకుపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన వర్షం, వరదల బీభత్సానికి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు బుధవారం మీడియా సమావేశం నిర్వహించి.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


ఈ ప్రకృతి విపత్తు హిమాచల్ ప్రదేశ్‌కు తీరని శోకాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు, వరదల కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు వెల్లడించారు. వరద సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్‌లో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సుఖ్వీందర్ సింగ్ సుఖు వివరించారు. కుండపోత వర్షాల కారణంగా తమ రాష్ట్రానికి రూ.10వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి కోలుకునేందుకు తమకు కనీసం ఏడాది సమయం పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు బుధవారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌వ్యాప్తంగా కొండ చరియలు విరిగిపడి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయని తెలిపారు. గత మూడు రోజుల్లోనే 60 మందికి పైగా మృత్యువాత పడినట్లు చెప్పారు.


ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోందని.. వర్షాల కారణంగా ధ్వంసమైన రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను పునర్నిర్మించేందుకు మరో ఏడాది సమయం పట్టొచ్చని సుఖ్వీందర్ సింగ్ సుఖు పేర్కొన్నారు. అయినప్పటికీ తాము వెనుకడుగు వేయడం లేదని.. వీలైనంత వేగంగా సదుపాయలను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు.. సిమ్లాలోని సమ్మర్‌ హిల్స్‌లో ఇటీవల ఓ ఆలయంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 30 మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తుండగానే.. మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సహాయక సిబ్బంది చేపట్టిన చర్యలకు ఆటంకం కలుగుతోంది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జులై నెలలో హిమాచల్‌ ప్రదేశ్‌లో కురిసిన భీకర వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహించాయి. కొండ చరియలు విరిగిపడి ఇళ్లు కూలిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఆ విపత్కర పరిస్థితుల నుంచి పూర్తిగా తేరుకోకముందే.. ఇటీవల మళ్లీ మరోసారి భారీ వర్షాలు కురిసి భీకర వరదలు పోటెత్తాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa