ఉత్తర్ ప్రదేశ్లోని మథురలో ఉన్న శ్రీ కృష్ణ జన్మభూమి సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. నాయీ బస్తీలో రైల్వే శాఖ చేపట్టిన అక్రమ కూల్చివేతలపై జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. పది రోజుల పాటు కూల్చివేత ప్రక్రియను నిలుపుదల చేయాలని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కూల్చివేతలను ఆపాలని కోరుతూ యాకుబ్ షా (66) అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
నాయి బస్తీ ప్రాంతంలో తమ కుటుంబాలు 1880 నుంచి నివసిస్తున్నట్లు పిటీషన్లో పేర్కొంది. ఆగస్టు 9 నుంచి రైల్వేశాఖ అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. దీంతో యాకుబ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. వచ్చే వారం మళ్లీ వాదనలు వింటామని పేర్కొంది. యాకుబ్ షా తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంతో చంద్ర సేన్ వాదనలు వినించారు. ఇప్పటికే 100 ఇళ్లను కూల్చివేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 70-80 ఇళ్లే ఇంకా మిగిలి ఉన్నాయని, మొత్తం కూల్చివేస్తున్నారని అన్నారు.
ఉత్తరప్రదేశ్లో కోర్టులకు సెలవు రోజున ఈ కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు. కాగా, ఈ కేసులో కౌశిక్ చౌదరీ, రాధా తార్కర్, ఆరన్ షాలు అడ్వకేట్లుగా ఉన్నారు. ఈ అంశంపై స్థానిక సివిల్ కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నా.. షా మాత్రం సుప్రీంను ఆశ్రయించారు. కాగా, శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కూడా తెరపైకి వచ్చింది. శ్రీకృష్ణుడి ఆలయ ప్రాంతానికి ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని కోరుతూ మథుర కోర్టులో పిటిషన్ దాఖలైంది. మొత్తం 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కృష్ణుడి ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారని పిటిషనర్లు ఆరోపించారు. 17వ శతాబ్దం నాటి ఈ మసీదును తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa