తిరుమల శ్రీవారి నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఈ నెల 19 (శనివారం)న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఈ నెల 21 ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. అలాగే శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను నవంబర్ నెల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ.
అంతేకాదు తిరుమల శ్రీవారి దర్శనంతో కూడిన ఆన్లైన్ సేవ (వర్చువల్)లకు సంబంధించిన టికెట్లు కూడా విడుదలకానున్నాయి. నవంబర్ నెలకు సంబంధించిన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్ల కోటాను ఈ నెల 22 మధాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అంతేకాదు నవంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టికెట్లను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమకు కావాల్సిన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులకు సూచించింది.
రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ ఆగస్టు 22 నుండి 26వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలను టీటీడీ నిర్వహించనుంది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 32 మంది వేద, శ్రౌత, స్మార్థపండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆగస్టు 26న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ధర్మగిరి వేద విజ్ఞన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో జరిగే కళ్యాణోత్సవంలో భక్తులు వర్చువల్గా పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఆలయంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే కళ్యాణోత్సవం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. రూ.500 చెల్లించి వర్చువల్ టికెట్ కొనుగోలు చేసిన భక్తులు 90 రోజుల్లోపు వస్తే అమ్మవారి ప్రత్యేక దర్శనానికి అనుమతించనున్నారు. మరోవైపు ఈ నెల 25న అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. వ్రతానికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు విడుదల చేశారు. అయితే ఆగస్టు 24న ఉదయం 9 గంటలకు అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న కుంకుమార్చన కౌంటర్లో.. కరెంట్ బుకింగ్లో 150 వ్రతం టికెట్లు విక్రయిస్తారు. భక్తులు రూ.వెయ్యి చెల్లించి టికెట్ కొనుగోలు చేయొచ్చు. ఒక్కో టికెట్పై ఇద్దరు గృహస్తులకు అనుమతి ఉంటుంది.. వర్చువల్ టికెట్లు పొందిన భక్తులను ఆగస్టు 26 నుంచి 90 రోజులలోపు అమ్మవారిని దర్శించుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa