ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎడెక్స్‌తో జగన్ సర్కార్ ఎంవోయూ,,,,విద్యార్థులకు ఉచితంగా కోర్సులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 18, 2023, 09:28 PM

ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు జగన్‌ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రపంచస్థాయి ఆన్‌లైన్‌ కోర్సులను ఉచితంగా అందించనుంది. ఈ కోర్సుల ద్వారా వచ్చే సర్టిఫికెట్లతో ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయంటున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎడెక్స్‌ సంస్థతో ఏపీ ఉన్నత విద్యాశాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై ఎడెక్స్‌ వ్యవస్థాపకుడు, సీఈవో అనంత్‌ అగర్వాల్‌, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు సంతకాలు చేశారు. ఇకపై రాష్ట్ర విద్యార్థులకు ఆన్‌లైన్‌ కోర్సులను అందించేందుకు ఎడెక్స్‌ సిద్ధమవుతోంది. దీన్ని కరిక్యులమ్‌లో భాగం చేయనున్నారు.


ఈ ఒప్పందం ఉన్నత విద్యలో ఓ సరికొత్త మైలురాయిగా వ్యాఖ్యానించారు సీఎం జగన్. కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు హార్వర్డ్‌, ఎంఐటీ, కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌ వంటి విశ్వవిద్యాలయాలతో కలిసి ఎడెక్స్‌ సంయుక్తంగా సర్టిఫికెట్‌ ఇస్తుంది అన్నారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. విదేశాలకు వెళ్లి చదువుకోవడం చాలామందికి కష్టమైన విషయమన్నారు. ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు రూపొందించిన కోర్సులను ఇక్కడే ఉంటూ నేర్చుకునే అవకాశం దీని ద్వారా లభిస్తుంది అన్నారు. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ మాత్రమే కాదు, ఆర్ట్స్‌, కామర్స్‌ల్లోనూ పలు సబ్జెక్టులకు సంబంధించిన కోర్సులు ఈ ఒప్పందం ద్వారా అందుబాటులోకి వస్తాయన్నారు. విద్యార్థి తనకు కావాల్సిన సబ్జెక్టును ఎంచుకొని చదువుకునే అవకాశం ఉండాలని.. ఇందుకోసం ఒక బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.


పేద, మధ్య తరగతి విద్యార్థులకు సైతం ప్రపంచ స్థాయి కోర్సులను అందించేందుకు ఈ ఒప్పందం చేసుకున్నారు. హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్‌­ఫర్డ్, కేంబ్రిడ్జి సహా ఇతర ప్రపంచ అత్యుత్తమ వర్సిటీల సర్టిఫికేషన్‌ పొందేలా ఎడెక్స్‌‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఏపీ విద్యార్థులు దాదాపు వెయ్యికి పైగా కోర్సులను ఆర్ట్స్, కంప్యూటర్‌ సైన్స్, ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌లెర్నింగ్, లా, సైకాలజీ, బయాలజీ, మెడిసిన్‌ లాంటి అనేక విభాగాల్లో చదువుకోవచ్చు. ఎడెక్స్‌ ద్వారా టాప్‌ వర్సిటీల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి సర్టిఫికేషన్‌ లభిస్తుంది.


ఎడెక్స్‌ ప్రపంచంలో ప్రముఖ ఈ–లెర్నింగ్‌ ప్లాట్‌ ఫారమ్‌.. ఇది 170కిపైగా టాప్‌ ర్యాంకింగ్‌ విద్యా సంస్థల నుంచి ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తోంది. ఇందులో 37 టాప్‌ 50 విశ్వవిద్యాలయాలున్నాయి. ప్రపంచంలోనే టాప్‌–4 వర్సిటీలైన ఎంఐటీ, హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌ కూడా ఉన్నాయి. ఎడెక్స్‌ ఓపెన్‌ సోర్స్‌ ప్లాట్‌ ఫారమ్‌ను రాష్ట్ర విద్యార్థులు ఉచితంగా ఉపయోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యాసంస్థల్లో పలు కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంస్కరించి పైథాన్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటివి సిలబస్‌లో చేర్చింది. ఈమేరకు కరిక్యులమ్‌ సిద్ధమైనా బోధనా సిబ్బంది తగినంతగా అందుబాటులో లేనందున విద్యార్ధులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం అందడం లేదు. ఈ నేపథ్యంలో ఎడెక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా విద్యార్ధులు వరల్డ్‌క్లాస్‌ వర్సిటీలు, ఇతర విద్యా సంస్థలు అందించే కోర్సులను రెగ్యులర్‌ కోర్సులతో పాటుగా అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa