ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జాల్లు కురిపించారు. ఏపీ ఎన్జీవో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ కీలక హామీలు ఇచ్చారు. పెండింగ్లో ఉన్న డీఏలో ఒకటి దసరా కానుకగా అందిస్తామన్నారు. హెల్త్ సెక్టార్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఐదు రోజుల క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. 2019 నుంచి 3 లక్షల 19 వేల ప్రభుత్వ ఉద్యోగులను నియమించామని.. 53 వేల మంది హెల్త్ సెక్టార్లో నియమించామని గుర్తు చేశారు. ఉద్యోగులు రిటైరయ్యాక వారి జీవితాల్లో మంచి జరగాలని తీసుకొచ్చామన్నారు. ఉద్యోగ వ్యవస్థను మెరుగుపరిచేలా అడుగులు వేశామన్నారు.
ఉద్యోగుల ఇబ్బందుల గురించి ఎప్పుడూ సానుకూలంగా స్పందించామన్నారు సీఎం. ఎంతో నిజాయితీగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించామని.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శగా నిలిచామన్నారు. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చామని.. జీపీఎస్ పెన్షన్ స్కీమ్కు రేపో, ఎల్లుండో ఆర్డినెన్స్ వస్తుందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న తపన ఉన్న వ్యక్తినని.. ఈ పెన్షన్ స్కీమ్ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలలో ప్రభుత్వ యంత్రాంగం విస్తరించిందన్నారు ముఖ్యమంత్రి. ఇప్పుడు 7 నియోజకవర్గాలకు ఒక కలెక్టర్, ఒక ఎస్పీని నియమించామన్నారు. గత ప్రభుత్వం పక్కన పడేసిన సమస్యలను పరిష్కరించామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. ప్రతీ చోటా దళారీ వ్యవస్థకు చెక్ పెట్టామని.. నెల మొదటి వారంలోనే జీతాలు ఇస్తూ ఉద్యోగులకు అండగా నిలిచామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగాల మీద మమకారం ఉన్న ప్రభుత్వం అన్నారు.
కారుణ్య నియామాల్లోనూ పారదర్శకత పాటించామని.. 10వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధులన్నారు.. ఉద్యోగుల సంతోషం, వారి భవిష్యత్తు ప్రభుత్వ బాధ్యతే అన్నారు. ఏ ప్రభుత్వంతో పోల్చినా తాము అంతకంటే మిన్నగా ఉన్నామని.. గత ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. పదవీ విరమణ వయస్తును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఎన్నికలకు 6 నెలల ముందు ఉద్యోగులను మభ్యపెట్టిందన్నారు. అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు పెంచింది ఈ ప్రభుత్వమే అన్నారు. కరోనా వంటి కష్ట సమయంలోనూ రెవెన్యూ తగ్గినా డీబీటీని అమలు చేశామన్నారు.
ఉద్యోగుల గురించి చంద్రబాబుకు దారుణమైన అభిప్రాయాలు ఉన్నాయన్నారు. బాబు దృష్టిలో కొందరే మంచోళ్లు అందరూ లంచగొండులేనని.. ఉద్యోగులను నిందించే హక్కు ఆయనకు ఎవరిచ్చారని మండిపడ్డారు. అలాంటి బాబు ఉద్యోగులకు మంచి చేయగలరా అని ఉద్యోగులు ఆలోచించాలన్నారు. బాబు హయాంలో దాదాపు 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారని.. బాబు కాలంలో ఆర్టీసీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చిత్తశుద్దిని చాటుకున్నామన్నారు. 2019 నుంచి ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించామని.. ప్రభుత్వం ఉద్యోగులకు ఎల్లప్పుడు సానుకూలంగానే ఉందన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రక్షించి కార్మికులకు తోడుగా ఉన్నామన్నారు సీఎం జగన్. ఉద్యోగుల ముఖంలో చిరునవ్వును చూడటమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa