ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డొనాల్డ్ ట్రంప్

international |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 10:27 PM

అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా పేరుగాంచిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి తాను అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ క్రమంలోనే ఓ వైపు ట్రంప్‌పై ఎన్నో పెద్ద పెద్ద కేసులు, అభియోగాలు మోపుతున్నప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. తాను ఖచ్చితంగా రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ఈ క్రమంలోనే త్వరలోనే రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ డిబేట్లు ప్రారంభం కానున్నాయి. అయితే తాను ఈ ప్రైమరీ డిబేట్లకు హాజరు కాబోనని ట్రంప్ ప్రకటించడం తీవ్ర సంచలనంగా మారింది. సాధారణంగా రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగే వారు అందరి మధ్య దశల వారీగా బహిరంగ డిబేట్‌లు జరుగుతుంటాయి. ఇందులో ఎక్కువ శాతం ఓట్లు సాధించిన వారు ఒక్కో దశను దాటుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే భారత్‌పై డొనాల్డ్ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే.. భారత్‌పై ప్రతీకార పన్నులు విధిస్తానని హెచ్చరికలు చేశారు.


గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్‌ను టారిఫ్ కింగ్ అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే భారత్‌కు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ - జీఎస్‌పీని ట్రంప్ రద్దు చేశారు. భారత్‌కు ఈ జీఎస్‌పీ ఉండటం వల్ల ఇండియన్ మార్కెట్లలోకి సమాన, హేతుబద్ధ సంధానత లభించలేదని ట్రంప్ ఆరోపించారు. ఈ జీఎస్‌పీ కింద కొన్ని అర్హత గల అభివృద్ధి చెందుతున్న దేశాలు టాక్సులు లేకుండా అమెరికాకు ఎగుమతి చేసే వీలు ఉంటుంది. అయితే ట్రంప్‌ హయాంలో భారత్‌కు రద్దయిన జీఎస్‌పీ హోదాను పునరుద్ధరించేందుకు ఇరు దేశాల మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.


మరోవైపు.. 2019 లో అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌.. భారత్‌ను ఆయన టారిఫ్‌ కింగ్‌ అని సంబోధించారు. ఇప్పుడు మరోసారి ఈ టాక్స్‌ల గురించి మాట్లాడిన ట్రంప్.. భారత్‌పై విధించనున్న పన్ను రేట్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హార్లే - డేవిడ్‌సన్‌ లాంటి అమెరికా ఉత్పత్తులపై భారత్‌ భారీగా టారిఫ్‌లు, టాక్స్‌లు విధిస్తోంది. భారత్‌లో 100 శాతం, 150 శాతం, 200 శాతం పన్నులు ఉన్నాయని.. ఇలా అయితే అమెరికా కంపెనీలు భారత్‌తో ఎలా వ్యాపారం చేయగలవని అన్నారు. అమెరికా కంపెనీలు భారత్‌కు వెళ్లి అక్కడే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే ఎలాంటి టారిఫ్‌లు ఉండవని.. అందుకే భారత్‌ అలా కోరుకుంటోందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. దీంతోపాటు అమెరికా ఉత్పత్తులకు భారత్ 200 శాతం పన్నులు వసూలు చేస్తుంటే.. అమెరికా మాత్రం భారత్ ఉత్పత్తులకు ఎలాంటి సుంకాలు విధించకూడదా అని ప్రశ్నించిన ట్రంప్ అది సరికాదని పేర్కొన్నారు. అమెరికా పన్నులు చెల్లిస్తే.. భారత్ నుంచి కూడా పన్నులు వసూలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే.. భారత్‌పై పరస్పర సమానమైన ప్రతీకార పన్నును విధిస్తానని ట్రంప్‌ స్పష్టం చేశారు.


మరోవైపు.. తాను రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షుడి బరిలోకి దిగుతున్నట్లు తెలిపిన ట్రంప్.. ప్రైమరీ డిబేట్లకు హాజరుకానని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఈ బుధవారం జరిగే రిపబ్లికన్‌ ప్రెసిడెన్షియల్‌ ప్రైమరీ డిబేట్‌లో పాల్గొనడం లేదని వెల్లడించారు. భవిష్యత్తులో జరిగే డిబేట్లకు కూడా హాజరు కానని చెప్పిన ట్రంప్.. తాను ఎంత విజయవంతంగా అధ్యక్ష పదవిని నిర్వర్తించానో అమెరికన్లకు తెలుసని అందుకే తాను చర్చలు చేపట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. దీనికి సంబంధించి.. ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా అయిన ట్రూత్‌ ఖాతాలో రాసుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa