ఉత్తర్ ప్రదేశ్లో నేరాలను అదుపుచేయడానికి ఆ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పోలీస్ ఉన్నతాధికారులకు యూపీ డీజీపీ విజయ్ కుమార్ పంపిన సర్క్యులర్పై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. హత్యలు, దోపిడీ, దొంగతనం వంటి నేరాలను అరికట్టాలని ఆదేశించిన ఆయన.. రాత్రిపూట జరిగే నేరాలను నియంత్రించాలని అందులో కోరారు. అంతేకాదు, అమావాస్య రోజుల్లోనే నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన.. లేఖతో పాటు హిందూ పంచాంగాన్నీ పోలీసులకు పంపారు. అమావాస్యకు ఒక వారం ముందు.. వారం తర్వాత ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయని వివరించారు.
పంచాగం సహాయంతో ఈ రోజుల్లో జరిగే నేరాలను అరికట్టాలని ఆయన ఆదేశించారు. సెప్టెంబరులో 14, అక్టోబరులో 14వ తేదీల్లో అమావాస్య తిథి ఉంది కాబట్టి ఈ తేదీల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రధాన కార్యాలయాల స్థాయిలో జరిగిన సంఘటనలను విశ్లేషిస్తే హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస్య తేదీకి ఒక వారం ముందు.. ఒక వారం తర్వాత రాత్రిపూట ఎక్కువ సంఘటనలు జరుగుతున్నట్లు తేలింది.. సీనియర్ పోలీసు అధికారుల స్థాయిలో ప్రతి నెలా ఈ విశ్లేషణ జరగాలి’ అని ఆయన పేర్కొనడం గమనార్హం.
‘సమర్ధవంతంగా నేరాలను నిరోధించడం పోలీసుల ప్రధానాంశాలలో ఒకటి.. పటిష్టమైన పోలీసింగ్ ద్వారా రాష్ట్రంలోని సామాన్య పౌరులకు భద్రతతో కూడిన వాతావరణం నెలకొల్పాలి.. దీని కోసం రాత్రి పెట్రోలింగ్ మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.. తద్వారా సాధారణ ప్రజలకు తమ భద్రతపై విశ్వాసం కలుగుతుంది’ అని డీజీపీ వివరించారు. పోలీసు అధికారులు క్రిమినల్ హాట్స్పాట్లను గుర్తించాలని, ఏదైనా నేర సంఘటనలను మ్యాప్ చేయాలని, తద్వారా వాటిని ప్రణాళికాబద్ధంగా అరికట్టాలని డీజీపీ కోరారు. నేరాలను అరికట్టడానికి పంచాంగాన్ని అనుసరించాలన్న డీజీపీ సూచనలపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముహూర్తాలు, పంచాంగాలను చూసి నేరాలు చేస్తారా? మనం ఏ కాలంలో ఉన్నామని ప్రశ్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa