ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్లాన్ లేకుండా అడ్డగోలుగా హిల్ స్టేషన్లపై నిర్మాణాలు,,,తరుచూ విపత్తులతో అల్లాడుతున్న హిమాలయ రాష్ట్రాలు

national |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2023, 10:11 PM

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఇతర హిమాలయ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడటం, విపత్తులు, రద్దీగా ఉండే హిల్ స్టేషన్ల సామర్థ్యంపై సమగ్ర అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయించింది. పర్యావరణం, హైడ్రాలజీ, ఎకాలజీ, వాతావరణ నిపుణుల అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రణాళికారహిత అభివృద్ధి పనుల వల్ల ఇటీవలి కాలంలో అక్కడ తలెత్తుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.


ఇది చాలా ముఖ్యమైన అంశమని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. హిల్ స్టేషన్లలో పర్యావరణ సమతౌల్యత దెబ్బతినకుండా గరిష్ఠంగా ఎంతమంది నివాసం ఉండొచ్చేనేది (క్యారీయింగ్‌ కెపాసిటీ) తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో హిమాలయాలు విస్తరించి ఉన్నాయని.. పర్యాటక ప్రదేశాల్లో క్యారీయింగ్‌ కెపాసిటీ, బృహత్‌ ప్రణాళికలపై మదింపు జరగాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సీజేఐ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.


రోజూ హిమాలయ ప్రాంతంలో ఏదోఒక విధమైన నష్టం సంభవిస్తున్నందువల్ల నిపుణుల అధ్యయనం అవసరం ఉందని పిటిషనర్‌ అశోక్ కుమార్ రాఘవ తరఫు న్యాయవాది ఆకాశ్ వశిష్ట పేర్కొన్నారు. ఏ సంస్థలతో ఏయే అంశాలపై అధ్యయనం చేయిస్తే బావుంటుందో క్లుప్తమైన నివేదిక అందజేయాలని కేంద్రం, పిటిషినర్లకు ధర్మాసనం చెప్పింది. ధర్మాసనంలో జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర ఉన్నారు.


కమిటీ విధివిధానాలేమిటో సూచించాలని కేంద్రాన్ని, పిటిషనర్‌ను కోర్టు కోరింది. ‘మేము ప్యానెల్ పనిని హిమాలయ రాష్ట్రాలకు పరిమితం చేస్తాం... మాకు ముసాయిదా సూచనలు ఇవ్వండి.. వచ్చే సోమవారం నివేదికలను పరిశీలిస్తాం’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించారు. దీనిపై అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి స్పందిస్తూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అధ్యయనానికి నిపుణుల కమిటీ వేసినట్టు కోర్టుకు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని హిల్ స్టేషన్లు వారి అధికార పరిధిలోకి వస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిస్పందనలను కోరినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ద్విముఖ వ్యూహాన్ని అవలంబిస్తామని తెలిపింది. ఒక వైపు హిల్ స్టేషన్ల స్థిరమైన అభివృద్ధి, పట్టణీకరణకు అన్ని రాష్ట్రాల నుంచి ఎనిమిది వారాల్లో స్పందన కోరాలి... మరోవైపు, హిమాలయ రాష్ట్రాల్లో సామర్థ్యాన్ని నిర్ణయించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది.


‘కేంద్రం సూచనలపై అన్ని రాష్ట్రాలు ప్రతిస్పందించే వరకు మేము వేచి ఉండలేం... రాష్ట్రాల నుంచి ప్రతిస్పందనలను స్వీకరించిన తర్వాత దానిని క్రోడీకరించి కోర్టుకు నివేదికను కేంద్రం అందించవచ్చు.. అదే సమయంలో నిపుణుల కమిటీ హిమాలయ రాష్ట్రాల మోసే సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు’అని ధర్మాసనం పేర్కొంది. అనంతరం విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa