‘జమ్మూ-కశ్మీర్ రాజ్యాంగ పరిషత్’ గడువు 1957లో ముగియడంతోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దయినట్లేనన్న వాదన ఆమోదయోగ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్కు భారత రాజ్యాంగం వర్తిస్తుందనేది ఆ రాష్ట్ర రాజ్యాంగంలోని ఐదో అధికరణం కూడా చెప్పిందని తేల్చిచెప్పింది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారించింది.
జమ్మూ కశ్మీర్ రాజ్యాంగ పరిషత్ పదవీకాలం ముగిసిపోయిన తర్వాత ఆర్టికల్ 370 కొనసాగుతుందా? రద్దవుతుందా? అనే అంశంపై వాదనలు కొనసాగాయి. ఆర్టికల్ 370ను రద్దును సవాల్ చేసినవారి తరఫు సీనియర్ న్యాయవాది దినేశ్ ద్వివేది తొలుత వాదనలు వినిపించారు. ‘జమ్మూకశ్మీర్ రాజ్యాంగాని’కి కాలం చెల్లడంతోనే ఆర్టికల్ 370 కింద ఉన్న అధికారాలన్నీ చెల్లుబాటుకాకుండా పోతాయని ఆయన చెప్పారు.
ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన మాత్రమేనని, 1957 జనవరి 26 తర్వాత అది మనుగడలో లేనట్లేనని వివరించారు. ‘ఆర్టికల్ 370లో లేనిది చదవమని మీరు మమ్మల్ని అడుగుతున్నారు... జమ్మూ కశ్మీర్ రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత అది రద్దయ్యింది.. ఆర్టికల్ 370 రూపొందించినప్పుడు జమ్మూ కశ్మీర్ గందరగోళంలో ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చట్టపరమైన సంస్థ అని.. దీనికి సంబంధించిన విషయాలపై సంప్రదింపులు, సమ్మతి ఉండాలని నిబంధన పేర్కొంది’ అని న్యాయవాది తెలిపారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రద్దును వ్యతిరేకిస్తున్న ఇతరుల వాదనకు ఇది విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం అనే నిబంధన ఎక్కడ ఉందని దినేశ్ ద్వివేది ప్రశ్నించారు. ఆర్టికల్ 370ని ఎలా రూపొందించారో? దానివెనుక రాజ్యాంగ రూపకర్తల ఉద్దేశాన్ని తెలుసుకోడానికి రాజ్యాంగ పరిషత్ చర్చలను తాము పరిశీలించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు ఈ దశలో అన్నారు. దీనిపై బుధవారం కూడా విచారణ కొనసాగిస్తామని ధర్మాసనం తెలిపింది. కాగా, జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa