ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మారకార్థం ఈ నెల 28న ప్రత్యేకంగా రూ.100 నాణేన్ని ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా.. కేంద్రం రూపొందించిన రూ.100 నాణేన్ని.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన అతిథుల జాబితాలో ఎన్టీఆర్ భార్య అయిన తన పేరు కూడా చేర్చాలని లక్ష్మీపార్వతిరాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.
ఎన్టీఆర్తో తన వివాహం, ఎన్నికల్లో గెలుపు, చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యుల కుట్రలు అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ప్రస్తావించారు. ఆహ్వానితుల జాబితాలో తన పేరు చేర్చకుండా చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులను పిలవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ భార్యనైన తనను ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించలేదని.. వెంటనే జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని లక్ష్మీపార్వతి లేఖలో కోరారు. భార్యగా తానే అసలైన వారసురాలినని లేఖలో పేర్కొన్న లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ పేరుపై రూ.100 నాణెం విడుదల చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబం ఈ నెల 28న ఢిల్లీకి తరలివెళ్తోంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ పిలిచే బాధ్యతను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి అప్పగించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఎన్టీఆర్ కుటుంబంలో కొడుకులు, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం చంద్రబాబు ఈ నెల 27 సాయంత్రమే ఢిల్లీ వెళ్తున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులు 28న ఉదయం ఢిల్లీకి చేరుకొంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హాజరవుతారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. లోకేష్ మాత్రం తన పాదయాత్ర కార్యక్రమం వల్ల హాజరు కావడం లేదు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు ఆయనతో పరిచయం ఉన్న మరి కొందరు ప్రముఖులను కూడా పురందేశ్వరి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
నలభై నాలుగు మిల్లీ మీటర్ల చుట్టు కొలతతో ఉండే ఈ నాణాన్ని వెండి, రాగి, నికెల్, జింక్తో తయారు చేశారు. ఈ నాణేనికి ఒకవైపు మూడు సింహాలతోపాటు అశోక చక్రం ఉంటుంది. రెండో వైపు ఎన్టీఆర్ చిత్రం ముద్రించారు. దాని కింద హిందీ భాషలో నందమూరి తారక రామారావు శత జయంతి అని ముద్రించారు. మరోవైపు ఈ నెల 28న చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలవాలన్న ప్రయత్నంలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa