ఉత్తర ప్రదేశ్లోని ఇప్పటికే ‘బుల్డోజర్ల’తో రౌడీ షీటర్లు, నేరస్థుల ఇళ్లను ధ్వంసం చేస్తున్న యోగి సర్కారు చూపు ఇప్పుడు వాహనాల స్టిక్కర్లపై పడింది. వాహనాలపై కులాలు, మతాలకు సంబంధించిన స్టిక్కర్లు వేసుకునే వారికి యూపీ సర్కారు చలానాలు వడ్డింపు మొదలుపెట్టింది. ఖరీదైన కార్లు మొదలు స్కూటర్లు, మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ వెహికిల్స్ వేటినీ వదలకుండా ట్రాఫిక్ పోలీసులు ఈ చలాన్లు వేయడం షురూ చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతోనే యూపీ ట్రాఫిక్ పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది.
వాహనాలపై ఉండే క్యాస్ట్ స్టిక్కర్లు లేదా కులాలను గుర్తు చేసేలా ఏవైనా మెసేజ్లు ఉండటం డ్రైవర్లు, రైడర్ల దృష్టిని మళ్లిస్తుందని.. ఫలితంగా ఇది రోడ్డు ప్రమాదాలకు దారి తీయొచ్చని యూపీ పోలీసులు చెబుతున్నారు. ఏదో కొద్ది రోజులపాటు హడావుడి చేసి వదిలేయకుండా.. దీర్ఘ కాలంపాటు చర్యలు చేపడతామని యూపీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రూల్స్ ఉల్లంఘించి వాహనాలపై కులాల పేర్లు కనిపించేలా స్టిక్కర్లు వేసుకునే వారికి పెనాల్టీ విధిస్తామని హెచ్చరించారు.
కులం, మతానికి సంబంధించిన స్టిక్కర్లతోపాటు అవసరం లేని రాతలు రాసిన వాహనాలపై యూపీ పోలీసులు పది రోజుల్లో 1542 చలానాలు విధించారు. వాహనాలపై కులాలకు సంబంధించిన స్టిక్కర్లు ఉంటే కచ్చితంగా చలానా వేస్తామని ఘజియాబాద్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ (ట్రాఫిక్) రామానంద్ ఖుష్వాహా తెలిపారు.
వాహనంపై కులం లేదా మతానికి సంబంధించిన స్టిక్కర్లు లేదా సింబల్స్ కనిపిస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నారు. ఒకవేళ ఈ స్టిక్కర్లు నంబర్ ప్లేట్పై ఉంటే జరిమానా మోత మరింత మోగుతోంది. ఏకంగా రూ.5 వేల పెనాల్టీ విధిస్తున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం.. నంబర్ ప్లేట్ మీద వాహనం నంబర్ మాత్రమే ఉండాలి. వేరే ఏం రాసినా అది అక్రమమే అవుతుందని యూపీ పోలీసులు తెలిపారు.
మన దగ్గర కూడా చాలా మంది వాహనాలపై తమ కులాల పేర్లు రాసుకుంటారు. తాను ఫలానా సామాజికవర్గానికి చెందిన వ్యక్తినని చెప్పుకోవడం కోసం ఇలా చేస్తుంటారు. మన దగ్గర కూడా ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి డ్రైవ్ చేపడితే.. ట్రాఫిక్ విభాగానికి కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa