ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీ 20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దూరం

international |  Suryaa Desk  | Published : Fri, Aug 25, 2023, 09:39 PM

జీ 20 దేశాధినేతల సదస్సుకు ఈ ఏడాది భారత్ అధ్యక్షత వహిస్తోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు జీ 20 దేశాలకు చెందిన అధినేతలు హాజరు కానున్నారు. అయితే ఈ జీ 20 దేశాధినేతల సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కావడం లేదని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ శుక్రవారం వెల్లడించారు. భారత్‌లో జరిగే జీ 20 సమావేశాలకు పుతిన్ రావడం లేదని చెప్పారు. భారత్‌లో పర్యటించేందుకు వ్లాదిమిర్ పుతిన్ ఎలాంటి ప్రణాళికలు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా దృష్టి మొత్తం ఉక్రెయిన్‌పై చేపట్టిన ప్రత్యేక సైనిక చర్యపైనే అని దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. పుతిన్ రావడం లేదని రష్యా అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తేల్చి చెప్పడంతో.. రష్యా అధ్యక్షుడు వస్తారా లేదా అనే ప్రశ్నపై సందిగ్ధత వీడింది.


ఈ ఏడాది జీ 20 బృందానికి అధ్యక్షత భారత్‌ వహిస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జీ 20 దేశాధినేతల సదస్సు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పుతిన్‌ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశాలు లేవని రష్యా స్పష్టతనిచ్చింది. అయితే వర్చువల్‌గానైనా పుతిన్ పాల్గొంటారా లేదా అనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని దిమిత్రి పెస్కోవ్‌ చెప్పారు. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో నిర్వహించిన బ్రిక్స్‌ సదస్సు కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హాజరు కాకపోవడం గమనార్హం. పుతిన్ తరఫున రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ బ్రిక్స్‌ సమావేశాలకు హాజరు అయ్యారు.


అయితే పుతిన్ విదేశాల్లో పర్యటించకపోవడం, బ్రిక్స్, జీ 20 లాంటి ప్రతిష్ఠాత్మక సదస్సులకు గైర్హాజరు కావడంపై పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రారంభించి ఏడాదిన్నర దాటింది. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. ఉక్రెయిన్‌లోని చిన్న పిల్లలను రష్యా ఎత్తుకెళ్లి పోయిందన్న ఆరోపణలపై ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు - ఐసీసీ పుతిన్‌పై అరెస్టు వారెంట్‌ కూడా జారీ చేసింది. దీంతో ఆయన విదేశాలకు వెళ్తే అరెస్టు చేస్తారనే భయం పట్టుకుంది. అయితే ఐసీసీ సభ్యదేశంగా ఉన్న దక్షిణాఫ్రికా.. ఒకవేళ పుతిన్‌ తమ దేశానికి వస్తే అరెస్టు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పుతిన్ బ్రిక్స్‌ సదస్సుకు హాజరుకాలేదు. అటు.. గతేడాది ఇండోనేషియాలో జరిగిన జీ 20 సదస్సులో కూడా పుతిన్‌ పాల్గొనలేదు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa