అమెరికా అధ్యక్ష ఎన్నిల సమయంలో జార్జియా ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారనే అభియోగాలు నమోదు కావడంతో అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు అయ్యారు. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జార్జియా రాష్ట్ర ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ఆయనపై నమోదైన నేపథ్యంలో లొంగిపోవాల్సి ఉంది. ఈ మేరకు జార్జియా జైల్ వద్ద గురువారం ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన స్వయంగా ఫుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి.. రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్ను సమర్పించారు. దీంతో బెయిల్ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్ని ఫాని విల్లీస్ అనుమతించారు.
మొత్తం ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్ జైలుకు వెళ్లారు. ట్రంప్పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసు ఇది. ఆయనపై మోపిన మొత్తం అభియోగాల్లో ‘ది రాకెటీర్ ఇన్ఫ్లూయెన్స్ అండ్ కరప్ట్ ఆర్గనైజేషన్స్ యాక్ట్’ (రికో) ఉల్లంఘన అత్యంత తీవ్రమైంది. క్రిమినల్ సిండికేట్లను నిరోధించేందుకు రికో చట్టాన్ని అమెరికాలో తీసుకొచ్చారు. ఈ చట్టం కింద కేసు నమోదయితే వేర్వేరు అంశాలను కలిపి కుట్రలను బయటపెట్టే అవకాశం ప్రాసిక్యూటర్లకు లభిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ జైలుకు వెళ్లి లొంగిపోయి అక్కడ 20 నిమిషాలు గడిపారు.
అక్కడ ట్రంప్ శారీరక ప్రమాణాలను జైలు సిబ్బంది నమోదు చేశారు. ట్రంప్ ఎత్తును ఆరు అడుగుల మూడు అంగుళాలు (1.9 మీటర్లు), అతని బరువు 215 పౌండ్లు (97 కిలోగ్రాములు), ఆయన జుట్టు రంగు ‘బ్లాండ్ లేదా స్ట్రాబెర్రీ’గా ఆ జాబితాలో పేర్కొన్నారు. దీంతో అమెరికా చరిత్రలో మగ్ షాట్ తీసుకున్న మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. పోలీసుల రికార్డుల్లో ఖైదీగా ఫోటోను తీసుకోవడాన్ని మగ్ షాట్ అంటారు. అనంతరం ప్రక్రియలన్నీ పూర్తి కావడంతో ఆయన బెయిల్పై బయటకొచ్చారు.
ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాముగా లొంగిపోయినా దాన్ని అరెస్ట్గానే పరిగణిస్తారు. ఎన్నికలకు సంబంధించిన కేసులోనే ట్రంప్ కొద్ది రోజుల కిందట అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, తాను ఏ తప్పు చేయలేదని ట్రంప్ వెల్లడించారు. తాజా కేసులో జార్జియా రాష్ట్రంలో ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినట్లు ఫుల్టన్ కౌంటీ గ్రాండ్ జ్యూరీ జారీ చేసిన 41-ఛార్జి డాక్యుమెంట్లో ట్రంప్ సహా 18 మందిపై అభియోగాలు మోపారు. నిందితుల జాబితాలో డొనాల్డ్ ట్రంప్ మాజీ లాయర్ రూడీ గులియానీ, వైట్హౌస్ మాజీ చీఫ్ మార్క్ మెడోస్, వైట్హౌస్ లాయర్ జాన్ ఈస్ట్మన్, జస్టిస్ డిపార్ట్మెంట్కు చెందిన మాజీ న్యాయమూర్తి జెఫ్రీ క్లార్క్ తదితరులు ఉన్నారు.
వాస్తవానికి 2020 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 2021లోనే ఎన్నికల్లో ట్రంప్ జోక్యంపై ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ అటార్ని ఫనీ విల్లిస్ దర్యాప్తు చేపట్టారు. ట్రంప్నకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలనే ఉద్దేశంతోనే సహ కుట్రదారులు ఇందులో భాగస్వాములయ్యారని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa