దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల పూర్తయినా.. కొన్ని మారుమూల గిరిజన ప్రాంతాలు ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యాలకు నోచుకోలేదు. కనీసం ఆటోలు, ద్విచక్ర వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ఏ అవసరం ఉన్నా కాళ్లకు పనిచెప్పాలిందే. గిరిజన తండాల్లో గర్భిణిలను ప్రసవ సమయంలో ఆసుపత్రికి చేర్చాలంటే నానా అగచాట్లు పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మార్గమధ్యలోనే ప్రసవించిన సంఘటనలు కూడా ఉండగా, పచ్చి బాలింతలు కిలోమీటర్ల దూరం వరకు కాలినడకన నడిచి వెళ్లిన దాఖలాలు ఉన్నాయి.
తాజాగా, అంబులెన్స్ రావడానికి మార్గం లేకపోవడంతో పురిటి నొప్పులతో ఓ గర్భిణి మూడు కిలోమీటర్ల దూరం నడిచింది. ఆమెకు నొప్పులు అధికమవడంతో 108 సిబ్బంది ఎదురొచ్చి పురుడుపోశారు. అనంతరం తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించారు. దారుణమైన ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో చోటుచేసుకుంది. కుంతుర్ల పంచాయతీ లుంజరిపుట్టు గ్రామానికి చెందిన కళావతి అనే గర్బిణికి శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు 108కి సమాచారం ఇచ్చారు.
గ్రామం వరకు అంబులెన్సు వచ్చే దారి లేదు. మూడు కిలోమీటర్ల దూరంలో కిముడుపల్లి వద్ద అంబులెన్స్ ఆగిపోయింది. గర్బిణిని కుటుంబసభ్యులు నడిపించుకుంటూ 3 కిలోమీటర్లు వెళ్లారు. ఇదే సమయంలో సిబ్బంది వారికి ఎదురెళ్లారు. కళావతి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ప్రాథమిక వైద్య సేవలు అందించారు. అనంతరం స్ట్రెచర్పై మోసుకుంటూ 108 అంబులెన్స్ వద్దకు చేర్చారు. అప్పటికే నొప్పులు తీవ్రతరం కావడంతో అంబులెన్స్లోనే ఆమెకు సిబ్బంది ప్రసవం చేశారు. కళావతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, అధిరక్తస్రావం కావడంతో తల్లీబిడ్డలను 108 అంబులెన్స్లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెకు వైద్యులు రక్తం ఎక్కించి, చికిత్స కొనసాగించారు. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, ఆ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa