ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుప్పంలో సెప్టెంబర్ 5 నుంచి ఆగనున్న రైలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 06:27 PM

చిత్తూరు జిల్లా కుప్పంవాసులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 5 నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కుప్పం రైల్వే స్టేషన్‌లో ఆగనున్నట్లు తెలిపింది. డాక్టర్‌ ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - షిర్డీ సాయినగర్‌ల మధ్య నడిచే ఈ సూపర్‌ ఫాస్ట్‌రైలుకు సెప్టెంబరు 5 నుంచి 2024 మార్చి 6 వరకు కుప్పంలో ఒక నిమిషం పాటు ఆగుతుందని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కుప్పం స్టేషన్‌లో చెన్నై నుంచి షిర్డీ వెళ్లే (22601) రైలు మధ్యాహ్నం 2.14కు వస్తుంది.. హాల్ట్ తర్వాత 2.15కు బయల్దేరి వెళుతుంది. అలాగే 22602 రైలు తిరుగు ప్రయాణంలో షిర్డీ నుంచి చెన్నైకు వస్తూ కుప్పంలో ఉదయం 4.44 నుంచి 4.45 వరకు ఒక నిమిషం ఆగుతుంది. షిర్డీకి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.


గత నెలలో పలు రైళ్లను ఏపీలోని రైల్వే స్టేషన్లలో ఆపాలని రైల్వేశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని బొబ్బిలి, దువ్వాడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, సూళ్లూరుపేట, పీలేరు, కుప్పం రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను ఆపాలని నిర్ణయం తీసుకున్నారు. బొబ్బిలిలో యశ్వంత్‌పూర్‌–హతియా ఎక్స్‌ప్రెస్‌ (12835), యశ్వంత్‌పూర్‌–టాటా నగర్‌ (12889), హతియా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ (22837–22838) లకు హాల్ట్‌లు ఇచ్చారు.


దువ్వాడ రైల్వే స్టేషన్‌లో విశాఖపట్నం–హజ్రత్‌ నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ (12803, 12804)తో పాటుగా శంకర్‌పల్లి–ముంబై ఎక్స్‌ప్రెస్‌ (18519 , 18520) రైలుకు స్టాప్ ఇచ్చారు. నడికుడిలో.. భువనేశ్వర్‌–సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌(17015), నాగర్‌సోల్‌–నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (17232), సికింద్రాబాద్‌–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (12733), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ –హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (12603) రైళ్లకు హాల్ట్ ఇచ్చారు.


సత్తెనపల్లిలో.. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ –హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (12603), భువనేశ్వర్‌–సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (17015), నాగర్‌సోల్‌–నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (17232) రైళ్లు ఆగుతాయి. పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో.. సికింద్రాబాద్‌–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (12733), భువనేశ్వర్‌–సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (17015), నాగర్‌సోల్‌–నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (17232), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ –హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (12603) రైళ్లకు స్టాప్‌లు ఇచ్చారు. సూళ్లూరుపేట స్టేషన్‌లో అళప్పుజా–ధన్‌బాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (13352).. పీలేరులో కాచిగూడ–మధురై ఎక్స్‌ప్రెస్‌ (17615, 17616), నాగర్‌కోయిల్‌ –ముంబై ఎక్స్‌ప్రెస్‌ (16340, 16339) రైళ్లు ఆగుతాయి. ఈ రైళ్లకు హాల్ట్‌లు ఇవ్వాలంటూ ఎంపీలు కోరడంతో పాటుగా.. ఆయా రైల్వే స్టేషన్‌లలో రద్దీని బట్టి రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మిగిలిన రైళ్లకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా రైల్వేశాఖ ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa