ఆంధ్రా క్రికెట్ సంఘం ఏర్పాటై 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, టీమిండియా మాజీ క్రికెటర్ మదన్ లాల్ ఆదివారం విశాఖపట్నం వచ్చారు. ఏసీఏ ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా వైఎస్సార్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పైలాన్ను వీరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిన్నీ మాట్లాడుతూ.. ఏసీఏ ప్రోత్సాహంతో ఆంధ్రా క్రికెటర్లు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారన్నారు. రాష్ట్రంలో క్రికెటర్లకు అవసరమైన మైదానాలు, మౌలిక వసతులు, అకాడమీలు పెరుగుతున్నాయన్నారు. విశాఖ నగరంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బిన్నీ.. 1975లో రంజీ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు నగరానికి వచ్చానన్నారు. అప్పటితో పోలిస్తే నగరం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఏపీ తరహాలో ఇతర రాష్ట్రాలు కూడా క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక ఐపీఎల్ గురించి మాట్లాడిన బిన్నీ.. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ఎంతో క్రేజ్ ఉందన్నారు. ఐపీఎల్ ప్రమాణాలను పాటించాలనే.. అందులో పాల్గొనే ఫ్రాంచైజీల సంఖ్యపై నియంత్రణ అవసరం అన్నారు. ఇప్పట్లో కొత్త ఫ్రాంచైజీలకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్లో ఆంధ్రా జట్టు ఉండాలని సీఎం జగన్ ఇటీవల ఆకాక్షించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో ఫ్రాంచైజీని దక్కించుకోవాలని.. విశాఖ స్టేడియంలో వైఎస్ విగ్రహావిష్కరణ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. తాజాగా విశాఖ వేదికగా బిన్నీ చేసిన వ్యాఖ్యలతో ఐపీఎల్లో ఆంధ్రా జట్టు ఉండటం ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టమైనట్లయ్యింది.
2008లో ప్రారంభమైన ఐపీఎల్లో 2021 వరకు 8 ఫ్రాంచైజీలే ఉండేవి. 2022 సీజన్లో రెండు కొత్త ఫ్రాంచైజీలు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ను చేర్చారు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల సంఖ్య పదికి చేరింది. లక్నో ఫ్రాంచైజీని రూ.7090 కోట్లకు ఆర్పీసీజీ గ్రూప్ కొనుగోలు చేయగా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ రూ.5625 కోట్లకు కొనుగోలు చేసింది. పదేళ్లలో ఐపీఎల్ జట్ల సంఖ్య 12కి చేరొచ్చని 2021లో స్టార్ స్పోర్ట్స్ సీఈవో సంజోగ్ గుప్తా అభిప్రాయపడ్డారు.
ఒకవేళ మరో 8 ఏళ్లలో కొత్తగా రెండు ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసినప్పటికీ.. ఫ్రాంచైజీల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2022లోనే ఫ్రాంచైజీ కోసం ఆర్పీసీజీ రూ.7 వేల కోట్లకుపైగా ఖర్చు చేసింది. కాబట్టి 2032 నాటికి ఫ్రాంచైజీ కోసం రూ.12 వేల కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏపీలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఏర్పాటుకు ఇంత మొత్తం వెచ్చించేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలి. అప్పుడే ఐపీఎల్లో ఏపీ ఫ్రాంచైజీ ఉండటం సాధ్యపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa