వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విస్పష్ట సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ ఎప్పుడూ జాతీయ భావంతో ఉండే పార్టీ అని.. జాతీయ రాజకీయాలతో తమ పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. కేవలం ప్రత్యేక హోదా అంశంపై కేంద్రంలోని బీజేపీతో విభేదించామని పేర్కొన్నారు. మిగతా విషయాల్లో తమకు కేంద్రంతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పానని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల సమయంలో పొత్తులుంటాయన్న చంద్రబాబు.. ముందస్తు ఎన్నికలుండే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన ప్రశంసలు జల్లు కురిపించారు. మోదీ వచ్చిన తర్వాతే దేశం ఖ్యాతి పెరిగిందని అన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. ఇండియా కూటమికి సరైన నాయకుడు లేకపోవడం బీజేపీకి వరమని అన్నారు. తాను చూడని రాజకీయం లేదని.. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేదని తేల్చిచెప్పారు. బీజేపీతో అంతర్గతంగా ఏమి చర్చిస్తున్నామనేది మీకు తెలియదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్కు ఉన్న అతిపెద్ద సమస్య సీఎం జగనే అని ధ్వజమెత్తారు. జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. విభజన గాయాలకంటే దారుణంగా రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. అటు, తెలంగాణ ఎన్నికల్లో పొత్తులపై కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని, పొత్తులపై ఇప్పటికే సమయం మించిపోయిందని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తుకు సమయం లేదని చెప్పారు. ఎవరు, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయాలపై కమిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa