ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాలంటీర్లను, లబ్ధిదారుల్ని బురిడీ కొట్టిస్తున్నారు,,,,జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 07:01 PM

ఏపీ ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నావారికి అలర్ట్. పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులపై సైబర్‌ నేరగాళ్లు కన్నేశారు. కొందరు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రాకపోవడాన్ని గుర్తించి.. వాలంటీర్లకు మాయ మాటలు చెప్పి అమాయకుల అకౌంట్‌లు ఖాళీ చేస్తున్నారు. ఇలా చాలామంది ప్రభుత్వ పథకాల లబ్ధిదార్లు మోసపోయారు. ఇదే తరహాలో కృష్ణా జిల్లాలో తాజాగా ఓ ఘటన జరిగింది. బాపులపాడు మండలం కాకులపాడు సచివాలయ పరిధి రంగయ్యప్పారావుపేటకు చెందిన చింతపల్లి సునీల్‌ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు సోమవారం అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. తాను అమరావతిలోని సచివాలయం నుంచి మాట్లాడుతున్నట్లు వాలంటీర్‌కు చెప్పాడు. గ్రామంలో ఎంతమంది వాలంటీర్లు ఉన్నారో లెక్క చెప్పడంతో నిజమని నమ్మాల్సి వచ్చింది. 'నీ పరిధిలో ఇద్దరికి అమ్మ ఒడి డబ్బులు పడలేదు కదా' అంటూ వాలంటీర్ సునీల్‌తో మాట కలిపాడు ఆ అపరిచిత వ్యక్తి.


నిజంగానే ఆ వ్యక్తి రాష్ట్ర సచివాలయం నుంచి మాట్లాడుతున్నారనుకున్నాడు ఆ వాలంటీర్. అప్పుడు అసలు డ్రామా మొదలుపెట్టాడు. అమ్మఒడి డబ్బులు రాని ఆ ఇద్దరి మొబైల్ నంబర్లతో తనకు కాన్ఫరెన్స్‌ కాల్‌ కలపమని ఆ సైబర్‌ నేరగాడు చెప్పాడు. ఆ ఇద్దరిలో ఒకరు తమకు అమ్మఒడి వచ్చేసిందని చెప్పగా.. నిర్మల జ్యోతి అనే మహిళ మాత్రం తనకు అమ్మఒడి వచ్చిందని.. కానీ జగనన్న విద్యాదీవెన రాలేదని చెప్పారు. మరికొద్దిసేపట్లో అకౌంట్‌లో ఆ డబ్బులు పడతాయంటూ చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ సైబర్ కేటుగాడు నేరుగా నిర్మల జ్యోతికి ఫోన్ చేశాడు. ఫోన్‌పే నంబరు చెబితే విద్యాదీవెన డబ్బులు పంపిస్తానని చెప్పాడు.. అయితే ఆమె తనకు ఫోన్‌పే లేదని చెప్పారు. తనకు తెలిసిన వారి ఫోన్‌పే నంబరు చెప్పగా.. ఫోన్‌పే యాప్‌‌లో తాను చెప్పినట్లుగా చేయాలని కొన్ని సూచనలు చేశాడు.. వారు కూడా ఫాలో అయ్యారు. తర్వాత కాసేపట్లో డబ్బులు అకౌంట్‌లో పడతాయంటూ ఆ అపరిచిత వ్యక్తి ఫోన్‌ పెట్టేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఫోన్ పే ద్వారా.. సదరు వ్యక్తి ఖాతాలోంచి రెండు విడతలుగా రూ.26 వేలు మాయం అయ్యాయి.


వెంటనే ఆ బాధితుడు నిర్మల జ్యోతి దగ్గరకు వెళ్లి డబ్బులు అకౌంట్ నుంచి కట్ చేశారని చెప్పాడు. ఆమె తనకు ఫోన్ చేసిన వ్యక్తి నంబర్‌కు కాల్ చేశారు. ఆ వ్యక్తి ఫోన్ తీసి డబ్బుల్ని తానే తీశానని.. ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నాడు. కేసు కూడా పెట్టుకోండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో బాధితురాలు వాలంటీర్‌ను వెంట తీసుకెళ్లి హనుమాన్‌జంక్షన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి వివరాలు చెబితే అకౌంట్‌లో డబ్బులు పోకుండా చర్యలు తీసుకుంటారని పోలీసులు సలహా ఇచ్చారు. బాధితులు వెంటనే ఫిర్యాదు చేశారు. అదే ఊరిలో పలువురు వాలంటీర్లకు, లబ్ధిదార్లకు ఇలాగే ఫోన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్ని టార్గెట్ చేస్తున్నారని.. అలర్ట్‌గా ఉండాలంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa