దేశంలో మరో 9 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. ముచ్చగా మూడోసారి అధికారం చేపట్టాలనే కృతనిశ్చయంతో బీజేపీ పావులు కదుపుతోంది. ఇదే సమయంలో ప్రధాని మోదీని సాగనంపడమే లక్ష్యంగా కాంగ్రెస్ సహా 26 విపక్ష పార్టీలు ‘ఇండియా’ పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. ముంబయి వేదికంగా ఆగస్టు 31, సెప్టెంబరు 1న ఇండియా కూటమి మూడో సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో విపక్ష కూటమికి పోటీగా కమలనాథులు వినూత్న ప్రచారం చేపట్టారు. ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్యార్జెనేగర్ నటించిన ‘టెర్మినేటర్’ సినిమాను వాడేస్తోంది.
ప్రధాని మోదీ ఫోటోతో ఆ సినిమా క్యాప్షన్ జోడిస్తూ .. ది టెర్మినేటర్‘‘2024లో నేనే తిరిగి వస్తాను!’’ అంటూ పోస్టర్ను క్రియేట్ చేసి ట్విట్టర్లో బీజేపీ షేర్ చేసింది. ‘ఇండియా’ కూటమికి వ్యతిరేకంగా 2024 ఎన్నికల్లో గెలిచి నరేంద్ర మోదీయే తిరిగి మళ్లీ ప్రధాని అవుతారని కాషాయపార్టీ ప్రచారం చేస్తోంది. ‘‘ప్రతిపక్షాలు ప్రధాని మోదీని ఓడించొచ్చని భావిస్తున్నాయి.. కలలు కనండి! టెర్మినేటర్ ఎల్లప్పుడూ గెలుస్తాడు’ అంటూ బీజేపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఈ పోస్టర్ను షేర్ చేస్తున్నాయి.
మరోవైపు, ముంబయి వేదికగా జరిగే మూడో సమావేశంలో మరిన్ని పార్టీలు తమతో చేరుతాయని ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన నేతలు చెబుతున్నారు. గురువారం నాటి సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు జెండా, ఎజెండా ఖరారవుతుందని సమాచారం. కాగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కూడా ముంబయి వేదికగా బలప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఎన్డీయేలో చేరిన ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)ని స్వాగతించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాదు, మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్సభ సీట్లపై రెండు రోజుల పాటు సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టు ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారు ప్రకటించింది. ముంబయిలోని సీఎం షిండే అధికారిక నివాసంలో గురువారం తొలిసారిగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా ఇతర సీనియర్ నాయకులు హాజరవుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa