ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అస్వస్థతకు గురైన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

national |  Suryaa Desk  | Published : Wed, Aug 30, 2023, 08:39 PM

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా దళ్ సెక్యులర్ పార్టీ ముఖ్య నేత కుమారస్వామి ఆస్పత్రి పాలయ్యారు. బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు కుమారస్వామి అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హుటాహుటిన బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాస్త అసౌకర్యం, నీరసం ఉందని కుమారస్వామి చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే కుమార స్వామి తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్లు అపోలో ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. ప్రస్తుతం కుమార స్వామికి అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మాజీ సీఎం అస్వస్థతకు గురి కావడంతో ఆయన పర్యటన రద్దయింది.


ప్రస్తుతం కుమారస్వామికి చికిత్స జరుగుతోందని అపోలో హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. ఆయనకు అన్ని రకాల టెస్ట్‌లు నిర్వహించినట్లు తెలిపారు. చికిత్స చేస్తున్నామని.. ఆ చికిత్సకు కుమారస్వామి ఆరోగ్యం కూడా బాగానే సహకరిస్తోందని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన డాక్టర్లు.. అది ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం పలువురు ప్రముఖులు బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి చేరుకుని కుమారస్వామిని పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. మరికొందరు కుమారస్వామి కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మరోవైపు.. కొన్ని నెలల క్రితం జరిగిన 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కుమారస్వామి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జేడీఎస్ తరఫున కర్ణాటక వ్యాప్తంగా చేపట్టిన ప్రచారంలో భాగంగా అలసట, జ్వరం కారణంగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.


అయితే బుధవారం కుమారస్వామి.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న కోలార్ జిల్లాలోని శ్రీనివాసపురలో పర్యటించాల్సి ఉంది. అక్కడ రైతుల భూములను పరిశీలించి వారితో మాట్లాడేందుకు వెళ్లాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుమార స్వామి ఆస్పత్రి పాలవడంతో కోలార్‌లో రైతులతో జరగాల్సిన సమావేశం రద్దు చేశారు. మరోవైపు.. మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జేడీఎస్ పార్టీ కార్యాలయంలో కుమార స్వామి వరుస సమావేశాలు నిర్వహించారు. దీంతో ఆయన అలసిపోయినట్లు జేడీఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా ఎదగాలన్న ఆశలు ఆవిరై.. ఘోర పరాభవం ఎదుర్కొన్న జేడీఎస్ పార్టీ.. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనైనా తమ కంచుకోట లాంటి సీట్లలో విజయం సాధించి పార్టీ పరువును నిలబెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు.. జేడీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ప్రధాని, కుమారస్వామి తండ్రి హెచ్‌డీ దేవెగౌడ అనారోగ్యం కారణంగా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa