అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్లను తమ భూభాగాలుగా పేర్కొంటూ చైనా విడుదల చేసిన ప్రమాణిక మ్యాప్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో చైనా ఆక్రమణ విషయంలో మోదీ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన ధ్వజమెత్తారు. గత కొన్నేళ్లుగా నేను ఇదే విషయం చెబుతున్నానని, చైనా దురాక్రమణ గురించి లడఖ్ ప్రజలందరికీ తెలుసునని కాంగ్రెస్ అగ్రనేత అన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించారు.
‘లడఖ్లో ఇంచు భూమిని కూడా చైనా ఆక్రమించలేదని ప్రధాని మోదీ చెప్తున్నారు.. కానీ అవన్నీ అబద్ధాలని నేను కొన్నేళ్లుగా చెబుతున్నాను.. చైనా దురాక్రమణ గురించి లడఖ్ ప్రజలందరికీ తెలుసు.. ఈ మ్యాప్ అంశం చాలా తీవ్రమైంది.. వారు మన భూభాగాన్ని లాగేసుకున్నారు. ప్రధాని మోదీ దీనిపై ప్రకటన చేయాలి’ అని రాహుల్ డిమాండ్ చేశారు.
అరుణాచల్, అక్సాయ్ చిన్లను తమ భూభాగంలో చూపుతూ చైనా రూపొందించిన మ్యాప్పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది సరిహద్దుల వివాదాలను మరింత తీవ్రం చేస్తుందని అభిప్రాయపడింది. ఆధారాల్లేకుండా మ్యాప్ను చైనా రూపొందించిందని స్పష్టం చేసింది. ‘అసంబద్ధమైన వాదనల ద్వారా ఇతరుల భూభాగాలను తమవని చెప్పుకోజాలరు’ అని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల్లో జీ-20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఈ మ్యాప్ను విడుదల చేయడం గమనార్హం.
ఇక, పదిరోజుల పాటు లడఖ్లో పర్యటించిన రాహుల్ గాంధీ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. తాజాగా ఆయన కర్ణాటకకు బయల్దేరి వెళ్తూ చైనా మ్యాప్పై మాట్లాడారు. మరోవైపు, ఈ మ్యాప్ వివాదంపై దౌత్యమార్గాల్లో నిరసన తెలియజేయాలని భారత్ నిర్ణయించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. ‘మ్యాప్నకు సంబంధించిన ఎటువంటి ఆధారం లేనందున మేము వాటిని తిరస్కరిస్తున్నాం.. చైనా చర్యలు సరిహద్దు వివాదాల పరిష్కారాన్ని క్లిష్టతరం చేస్తాయి’ అని ఉద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa