చిత్తూరు జిల్లా, పాకాల మండలం నేండ్రగుంట సమీపంలో ఒక కారు మూసివున్న రైల్వే గేటును ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ద్విచక్ర వాహనదారులు గాయాలపాలయ్యారు. తిరుపతి నుంచి రైలింజన్ పాకాల వైపు వస్తుండడంతో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో గేట్మాన్ రైల్వే గేటు మూశారు. దీంతో గేటుకు ఇరువైపులా ద్విచక్ర వాహనాలు ఆగివున్నాయి. ఇదే సమయంలో నేండ్రగుంట వైపు నుంచి అతివేగంగా వచ్చిన తెలుపు రంగు కారు రైల్వే గేటు ముందు నిలబడివున్న వాహనాలను, గేటును బలంగా ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాలపై వున్న నలుగురు గాయపడ్డారు.108 అంబులెన్స్లో తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. గేట్మాన్ ఇంజన్ను ఆపడానికి ప్రయత్నించడంతో కారు వివరాలు గమనించలేకపోయాడు.రైల్వే అధికారులు సంఘటనా స్ధలాన్ని పరిశీలించి తాత్కాలిక గేటు ఏర్పాటు చేశారు. పూతలపట్టు మండలం తోటవారిపల్లెకు చెందిన టి.రూపేష్ తన ఐ20 కారును వేగంగా నడిపి ఈ ప్రమాదానికి కారకుడైనట్లు కనుగొన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa