ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి విజయవాడ నుంచి ఎంపీగా గెలుస్తా,,,,కేశినేని నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 03, 2023, 07:15 PM

విజయవాడ ప్రాంతం కోసం.. విజయవాడ ప్రజల కోసం.. నేను మూడోసారి ఎంపీగా పోటీ చేస్తా.. మళ్లీ గెలుస్తానంటూ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీగా పోటీ చేసి గెలవడమే కాదు.. విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎం.ఎస్. బేగ్‌ను గెలిపిస్తానని.. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమేనంటూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత బేగ్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న కేశినేని నాని చేసిన ఈ కామెంట్స్ బెజవాడ టీడీపీలో హీట్ పుట్టించాయి. ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ నానికి దక్కే విషయమై అనుమానాలున్నాయి. టీడీపీ నాయకత్వం నాని తమ్ముడు చిన్నిని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో మూడోసారి తాను లోక్ సభలో అడుగుపెడతానంటూ నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బేగ్‌ను విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపిస్తానంటూ ఆయన టీడీపీలోని తన వైరి వర్గానికి పరోక్షంగా సవాల్ చేశారు.


ఎంపీ కేశినేని నానికి.. విజయవాడ వెస్ట్‌ సెగ్మెంట్‌లోని టీడీపీ నాయకుల మధ్య సంబంధాలు అంతగా లేవు. బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా ఓ వర్గంగా ఉంటూ.. నానిని వ్యతిరేకిస్తుంటారు. కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో వీరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ప్రస్తుతం విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఎం.ఎస్. బేగ్ తండ్రి ఎం.కె. బేగ్ గతంలో విజయవాడ వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1985, 1989, 1994, 2004లో పోటీ చేసిన సీనియర్ బేగ్.. మూడుసార్లు ఓడి 1989లో మాత్రం గెలుపొందారు. ఇప్పుడు ఆయన కుమారుడైన ఎం.ఎస్. బేగ్ టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ బుద్ధా వెంకన్న లాంటి నేతలను పక్కనబెట్టి చంద్రబాబు ఆయనకు టికెట్ ఇస్తారని అనుకోలేం. మరి ఇలాంటి పరిస్థితుల్లో బేగ్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తానని నాని చేసిన వ్యాఖ్యలు.. నేరుగా అధిష్టానానికే సవాల్ విసిరేలా ఉన్నాయనే భావన వ్యక్తం అవుతోంది.


తానెప్పుడూ ఆడంబరాలకు వెళ్లనన్న కేశినేని నాని.. అనవసరమైన ఖర్చులు చేసే బదులు పేదలకు సాయం చేయమని చెబుతానన్నారు. మీరు నాకు ఓటేసి పార్లమెంట్‌కు పంపిస్తే.. ప్రజాప్రతినిధిగా ఉన్నంత కాలం.. ప్రతి క్షణం మీకోసమే పని చేస్తానని బెజవాడ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ‘‘వ్యాపారం కావాలా..? ప్రజాసేవ కావాలా? అని నాకు నేను ప్రశ్నించుకున్నప్పుడు.. ప్రజాసేవ ముఖ్యమని 90 ఏళ్ల వ్యాపారాన్ని వదిలేసుకున్నాననే సంగతి మీకందరికీ తెలుసు. నాకు పేదలు ముఖ్యం. ఇక్కడి ప్రజల కోసం నేను దేనికైనా రెడీ. ప్రతి నిమిషం ఈ ప్రాంత ప్రజల కోసం నా సమయం వెచ్చిస్తాను. బాగా స్టడీ చేసిన వ్యక్తిగా చెబుతున్నాను.. ఈ ప్రాంతానికి బేగ్ ఎమ్మెల్యే అవుతాడు.. అసెంబ్లీలో అడుగుపెడతాడు. ఎంత మంది అడ్డం వచ్చినా.. బేగ్‌ను ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది. దాని కోసం ఏం చేయడానికైనా సిద్ధం. ప్రజా సేవకు పనికిరాని వ్యక్తులు ప్రజా సేవలో ఉండొద్దనేదే నా అభిమతం. అది నా పార్టీ కావొచ్చు.. లేదా వేరే పార్టీ కావచ్చు. విజయవాడ వెస్ట్ ప్రాంతానికి మంచి జరగాలన్నదే నా స్వార్థం. రెండేళ్లు గమనించిన తర్వాతే బేగ్ గురించి నేను ఇలా మాట్లాడుతున్నాన’’ని కేశినేని నాని వ్యాఖ్యానించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa