మళయాళీలు జరుపుకొనే అతిపెద్ద పండుగ అయిన ఓనమ్.. ప్రకాశం జిల్లా రైతులకు కాసుల వర్షం కురిపించింది. అక్కడెక్కడో కేరళలో ఓనమ్ పండుగ జరిగితే.. ఇక్కడ ప్రకాశం రైతులకు డబ్బులు రావడం ఏంటని అనుకుంటున్నారా..? ఆగస్టు 22-29 తేదీల మధ్య... వెయ్యి నుంచి 1200 టన్నుల పునాస మామిడి కాయలను ఇక్కడి రైతులు కేరళకు ఎగుమతి చేశారు. దీంతో పది రోజుల్లోనే రూ.5.5 కోట్లు సంపాదించారు. ఉలవపాడు ప్రాంతంలో పండే పునాస మామిడికి మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా కేరళలో ఓనమ్ సమయంలో ఈ డిమాండ్ మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగలో కేరళ ప్రజలు మన దగ్గర ఉగాది పచ్చడి తరహాలోనే ప్రత్యేక వంటకం తయారు చేస్తారు. ఆ వంటకంలో పునాస మామిడిని ఉపయోగిస్తారు. దీంతో ఏటా ఓనమ్ సీజన్లో ఆంధ్రా నుంచి పునాస రకం మామిడి కాయలను కేరళకు ఎగుమతి చేస్తున్నారు.
పునాస రకం మామిడి కాయలు మిగతా రకం మామిడి కాయల కంటే ఆలస్యంగా కోతకు వస్తాయి. నవంబర్ వరకు పునాస మామిడి కాయలను కోస్తుంటారు. చెన్నై, బెంగళూరు, కోల్కతా నగరాలతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఈ మామిడిని ఎగుమతి చేస్తారు. ‘ఈ సీజన్ ఆరంభంలో కిలో పునాస మామిడి రూ.40-45 పలికింది. తర్వాత దాని ధర రూ.65-70కి చేరింది. ఉలవపాడు రైతులు పది రోజుల్లో 100 నుంచి 150 టన్నుల మామిడిని కేరళకు ఎగుమతి చేశారు. రావులపాలెం, కడప, నెల్లూరు మార్కెట్ల నుంచి పోటీ ఉన్నప్పటికీ.. ఈసారి ఓనమ్కి ఉలవపాడు రైతులు మంచి ఆర్డర్లు పొందగలిగారు’ అని ఉలవపాడు నుంచి మామిడిని ఎగుమతి చేసే సయ్యద్ ఫజల్ మీడియాకు తెలిపారు. పునాస మామిడి కాయలను పచ్చళ్లకు ఎక్కువగా ఉపయోగిస్తారు. గత 4-5 ఏళ్లుగా ఈ రకం మామిడి కాయల ఎగుమతులు పెరుగుతున్నాయి. ఉలవపాడు ప్రాంతంలో 4 వేలకుపైగా ఎకరాల్లో పునాస రకం మామిడి తోటలను సాగు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇంతకు రెట్టింపు విస్తీర్ణంలో పునాస మామిడి సాగవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa