ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోవాలి. అది ప్రభుత్వంతో సమస్య ఉంటే అధికారులకు, రాజకీయ నాయకులను కలిసి మాట్లాడాలి. అదీ కాదంటే శాంతియుతంగా నిరసన తెలిపి తమ డిమాండ్లను సాధించుకోవాలి. కానీ రిజర్వేషన్లకు సంబంధించి చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో అందులో పాల్గొన్న ఓ గ్రామ సర్పంచ్ సహనం కోల్పోయాడు. కొత్తగా రూ. 30 లక్షలు పెట్టి కొనుక్కున్న తన కారును అందరూ చూస్తుండగానే నిప్పంటించి తగుల బెట్టాడు. ఈ పని చేసిన సర్పంచ్ను స్థానికంగా నిరసన తెలుపుతున్న వారు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే.
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరాఠా రిజర్వేషన్లు అమలు చేయాలని.. జాల్నా జిల్లాలోని అంతర్వాలి ప్రాంతంలో చేస్తున్న నిరసనలు శుక్రవారం హింసకు దారి తీశాయి. ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు చేసిన లాఠీఛార్జ్ను ఖండిస్తూ ఔరంగాబాద్ జిల్లాలో పూలంబ్రీ తాలూకాలోని గెవ్రాయ్ పాగా సర్పంచ్.. తన కారును తగలబెట్టాడు. అయితే మరాఠా రిజర్వేషన్ల కోసం కారును తగులబెట్టాలనే విషయం తెలుసుకుని స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పోలీసుల లాఠీఛార్జ్కి వ్యతిరేకంగా గెవ్రాయ్ పాగా సర్పంచ్ మంగేష్ సబలే.. రూ. 30 లక్షలు పెట్టి కొత్తగా కొనుక్కున్న కారుకు నిప్పు పెట్టి నిరసన ఉధృతిని తెలియజేశారు. ఆ సర్పంచ్ కారును తగులబెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అథనికి మద్దతుగా కామెంట్లు, పోస్టులు చేస్తున్నారు.
జాల్నా సమీపంలోని అంతర్వాలి ప్రాంతంలో మరాఠా రిజర్వేషన్ల కోసం శాంతి యుతంగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ పోలీసులు లాఠీఛార్జ్ చేశారని ఆందోళన చేస్తున్న వారు తెలిపారు. శాంతి భద్రతలను కాపాడేందుకే లాఠీఛార్జ్ చేశామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలోనే లాఠీఛార్జ్కు సంబంధించిన వీడియోలు బయటకు రావడం తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది. అదే ఘర్షణ వాతావరణం శనివారం కూడా కొనసాగింది. శుక్రవారం పోలీసులు చేసిన లాఠీఛార్జ్తో నిరసనకారులు రాళ్లు రువ్వడం, రోడ్లు మూసివేయడం, బంద్లకు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఏళ్ల తరబడి మరాఠా రిజర్వేషన్ల అంశం కొనసాగుతోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా శాంతి యుతంగా నిరసనలు సాగుతున్నా.. జాల్నా జిల్లాలోని అంతర్వాలిలో నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ తర్వాత మరాఠాలు ఆగ్రహించడంతో మరోసారి సమస్య తీవ్రతరం అయింది. దీంతో పోలీసుల లాఠీఛార్జ్ను నిరసిస్తూ వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa