ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విదేశీ పనిమనుషులకు ఆహ్వానం,,,పెళ్లిళ్లు, జనాభాను పెంచేందుకు ప్రభుత్వం కొత్త నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Sun, Sep 03, 2023, 09:52 PM

కొన్ని దేశాల్లో పెరుగుతున్న జనాభా ఒక సమస్య అయితే.. మరికొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోవడం మరో సమస్యగా మారుతోంది. జనాభా పెరిగితే ఎన్ని నష్టాలు ఉన్నాయో అదే జనాభా తగ్గిపోతే కూడా అంతే నష్టాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జనం పెళ్లిళ్లు చేసుకోవడం.. కొంతమంది పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనకపోవడంతో క్రమంగా జనాభా తగ్గిపోతూ వస్తోంది. ఇది కాస్త దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పెళ్లిళ్లు చేసుకోవాలని.. పిల్లల్ని కని దేశ జనాభాను పెంచాలని ప్రజలకు సూచిస్తోంది. దాని కోసం కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇళ్లలో పనిచేసేందుకు విదేశాల నుంచి పని మనుషులను తీసుకువచ్చేందుకు ఆమోదం ఇస్తోంది.


దేశంలో తగ్గిపోతున్న వివాహాలు, శిశు జననాల సమస్యను పరిష్కరించేందుకు దక్షిణ కొరియా కొత్త ఉపాయాన్ని ఆలోచించింది. ఇంటి పనుల్లో సహాయం చేసేందుకు విదేశీయులకు అనుమతించనుంది. ఎందుకంటే దేశంలో జనాభా తగ్గిపోతే దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారుతుంది. పనిచేసేవారు లేకపోతే దేశంలో ఉత్పత్తులు, సేవలు తగ్గిపోయి అది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అందుకే జనాభా, యువత తక్కువగా ఉన్న దేశాలు.. జనాభా పెంచాలని ప్రజలను ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇళ్లల్లో పనిచేసే పని మనుషులను విదేశాల నుంచి తెప్పించేందుకు అనుమతి ఇచ్చింది.


ఒకవైపు పెరిగిపోతున్న వృద్ధుల జనాభా.. మరోవైపు వివాహాలు, శిశు జననాలు తగ్గిపోవడంతో దక్షిణ కొరియా తీవ్ర ఆందోళన చెందుతోంది. దక్షిణ కొరియాలోని యువత.. పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లలను కనడంపై ఆసక్తి చూపడం లేదని గుర్తించింది. దీనికి పరిష్కారంగా ఓ పైలట్‌ ప్రాజెక్టును తీసుకురావాలని నిర్ణయించింది. పిల్లలను చూసుకోవడంతోపాటు ఇంటి పనుల భారాన్ని తగ్గించేందుకు.. ఇళ్లలో పనిచేసేందుకు విదేశాల నుంచి పనిమనుషులను తీసుకువచ్చేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో పైలట్ ప్రాజెక్టుగా రాజధాని సియోల్‌లోని ఇళ్లలో పనిచేసేందుకు ముందుగా 100 మందిని అనుమతించాలని నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ మొదలవుతుందని.. క్రమక్రమంగా పరిశ్రమలు, సంస్థలకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


దక్షిణ కొరియాలో ప్రజలు పెళ్లిళ్లపై ఆసక్తి చూపకపోవడం.. జననాల రేటు తగ్గుతుండటంతో ప్రభుత్వం ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. 19 నుంచి 34 ఏళ్ల లోపు ఉన్న వారిలో సగం మందికి పైగా.. పెళ్లి తర్వాత కూడా పిల్లల్ని కనాల్సిన అవసరం లేదని చెప్పినట్లు సర్వేలో తేలింది. కేవలం 36.4 శాతం మంది మాత్రమే పెళ్లి పట్ల సానుకూల దృక్పథం ఉన్నట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు, ఇంటిని నడపడం, పిల్లల్ని పెంచడం వంటి సమస్యల కారణంగానే పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా ఇంటిపనుల భారం తగ్గించేందుకు ఈ పైలట్ ప్రాజెక్టును తీసుకువచ్చింది. 20 నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉన్న ఇద్దరు జంటలతో పాటు సింగిల్‌ పేరెంట్‌, ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది.


అయితే దీనికి సంబంధించి విధివిధానాలను కూడా దక్షిణ కొరియా వెల్లడించింది. అయితే వేరే దేశాల నుంచి పనిచేయడానికి వచ్చే వారి కనీస వయసు 24 ఏళ్లు ఉండాలని తెలిపింది. దీంతోపాటు వారిపై ఏవైనా క్రిమినల్ , డ్రగ్స్ కేసులు ఉన్నాయా అని ఆరా తీయనున్నారు. పనితనం, పరిజ్ఞానం, వివిధ భాషలు మాట్లాడటం కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. 6 నెలలపాటు ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియా జనాభా దాదాపు 5.17 కోట్లు కాగా.. ఇప్పటికే ఆ దేశాన్ని జనాభా సంక్షోభం తీవ్రంగా వేధిస్తోంది. తయారీ, వ్యవసాయ రంగాల్లో కార్మికుల కొరత ఎక్కువగా ఉండటంతో కార్మికుల పనిగంటలను వారానికి 52 నుంచి 69 కి పెంచారు. అయితే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతే ప్రభుత్వం వెనక్కి తగ్గింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa