దీపం తాను ఆరిపోతూ కూడా చుట్టూ ఉన్నవారికి వెలుగును పంచుతుంది. హరిత కూడా అంతే తాను చనిపోతూ మరో నలుగురికి పునర్జన్మను ప్రసాదించింది. ఊహించని ప్రమాదంతో ఆయువు పోయినా.. మరో నలుగురు జీవితాల్లో వెలుగులు నింపింది. భౌతికంగా తాను ఈ ప్రపంచంలో లేకపోయినా.. అవయవదానంతో తానెప్పుడూ బ్రతికే ఉంటాననే అనే విషయాన్ని చాటి చెప్పింది. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన గుండ్ర హరిత (26) యశ్వంత్ ప్రసాద్రెడ్డి దంపతులు. యశ్వంత్ ఓ ప్రైవేటు బ్యాంకులో సహాయ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు 10 నెలల చిన్నారి కూడా ఉంది. అయితే గత నెల 29న ఇంట్లో ఉన్న సమయంలో హరిత తలనొప్పి వస్తోందంటూ అకస్మాత్తుగా కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను.. సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ సన్షైన్ ఆస్పత్రికి తరలించారు.
సన్షైన్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన వైద్యులు బ్రెయిన్డెడ్ అయినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జీవన్దాన్ వైద్య బృందం హరిత భర్త, ఇతర కుటుంబ సభ్యులను కలిశారు. అవయవదానంపై వారికి అవగాహన కల్పించారు. దీంతో వారు హరిత అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. హరిత నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తిని సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సర్జరీ ద్వారా అమర్చినట్లు జీవన్దాన్ ఇన్ఛార్జి స్వర్ణలత వెల్లడించారు. ఇలా హరిత తాను ఆరిపోతూ.. మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa