యువగళం పాదయాత్రలో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ పాదయాత్ర యువత గళం ప్రభుత్వానికి వినిపించేందుకే తప్ప.. గొడవలు సృష్టించేందుకు కాదన్నారు. యువగళం పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం పరిధిలోని బేతపూడిలోని క్యాంప్సైట్కు వెళ్లారు. మంగళవారం రాత్రి జరిగిన సభలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. గన్నవరంలో కూడా నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆ నోటీసులు అందుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు కవ్వింపులకు దిగారని.. తాడేరు దగ్గర తమపై రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. యువగళం వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సరికాదన్నారు.
కొంతమంది పోలీసుల తీరుతో ఆ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందన్నారు లోకేష్. తమను కించపరిచేలా ఫ్లెక్సీలు పెడుతున్నప్పుడు వాటిని ఎలా అనుమతించారో చెప్పాలన్నారు. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో పర్యటించానన్నారు. కానీ ఎక్కడా జరగని గొడవలు భీమవరంలోనే జరుగుతున్నాయని ప్రశ్నించారు. రెచ్చగొట్టేలా తాను ఏం వ్యాఖ్యలు చేశానో చెప్పాలన్నారు. ఏ పదాలు కించపరిచేలా ఉన్నాయో జగన్ చెప్పాలన్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహియాత్ర సమయంలో ఇక్కడే వైఎస్సార్సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారన్నారు. అప్పుడే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. యువగళం వాలంటీర్లను అదుపులోకి తీసుకుని వైఎస్సార్సీపీ నేతల ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని.. చట్టాలు ఇరువైపులా సమానంగా అమలు చేయాలన్నారు. చట్టం ఏ ఒక్కరికీ చుట్టంలా మార్చొద్దని.. ఇది రాష్ట్రానికి మంచిది కాదన్నారు. జగన్ పాదయాత్రలో ఇలాంటి ఘటన ఒక్కటి కూడా జరగలేదని.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎందుకు పంపించారని ఎమ్మెల్యేకు నోటీసులు పంపారా అన్నారు.
వైఎస్సార్సీపీ వాళ్లు గడప గడపకు కార్యక్రమం చేస్తున్నారని.. వాళ్ల ఒక్క ఫ్లెక్సీ జోలికి కూడా తాము వెళ్లడం లేదన్నారు. తమను కించపరిచేలా ఫ్లెక్సీలు పెట్టినపుడు ఎలా అనుమతించారన్నారు. భీమవరంలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు, జెండాలు ఉన్నాయని.. వాటిని తాము ఏమీ చేయలేదన్నారు. అయినా రాళ్ల దాడి చేశారని.. దాడికి యత్నిస్తున్నారని సెప్టెంబర్ నాలుగునే పోలీసులకు చెప్పామన్నారు.. వారు చర్యలు తీసుకోలేదన్నారు. శాంతియుతంగా పాదయాత్ర కొనసాగిస్తున్నా నినాదాలు చేస్తూ కర్రలు, రాళ్లతో దాడి చేశారని.. వైఎస్సార్సీపీ వాళ్లకి పోలీసులే భద్రత కల్పిస్తున్నారన్నారు. తాము శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని.. అలాగని తమ జోలికి వస్తే ఆత్మరక్షణ చేసుకునే హక్కు మాత్రం ఉంటుందన్నారు. శాంతియుతంగా ఉన్న గోదావరి జిల్లాల్లో గొడవలు సృష్టిస్తున్నారన్నారు.
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి దగ్గర యువగళం పాదయాత్ర క్యాంప్ సైట్కు పోలీసులు వెళ్లారు. మూడు వాహనాల్లో వచ్చిన పోలీసులు.. యువగళం వాలంటీర్లు, కిచెన్ సిబ్బంది సహా సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి లోకేష్ పాదయాత్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలోనే యువగళం వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa