దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జీ 20 సదస్సుకు హాజరు కావాలని ఇద్దరు సామాన్య మహిళా రైతులకు ఆహ్వానాలు అందాయి. జీ 20 దేశాలకు చెందిన అధ్యక్షులు, ముఖ్య నేతలు, ప్రతినిధులు హాజరు కానున్న ఈ సదస్సులో పాల్గొనాలని తమకు ఆహ్వానం అందడం పట్ల ఆ మహిళలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. పటిష్ఠ బందోబస్తు, భారీ నిఘా వ్యవస్థ మధ్య జరుగుతున్న ఈ జీ 20 దేశాధినేతల సమావేశాలకు హాజరు కావాలని ఇద్దరు మహిళా రైతులకు పిలుపు వచ్చింది. వారే ఒడిశా రాష్ట్రానికి చెందిన 36 ఏళ్ల రాయిమతి ఘివురియా, 45 ఏళ్ల సుబాశ మొహంత. తృణధాన్యాల సాగుతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న రాయిమతి ఘివురియా, సుబాశ మొహంత.. ఇద్దరు కలిసి సేంద్రియ వంగడాలపై ప్రపంచ నేతలకు వివరించనున్నారు.
వ్యవసాయంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక వ్యవసాయాన్నే వదిలేస్తున్న ఈ రోజుల్లో.. రాయిమతి ఘివురియా, సుబాశ మొహంత.. తమదైన శైలిలో వ్యవసాయం చేసి అద్భుతాలు సృష్టించారు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా కుంద్ర సమితికి చెందిన రాయిమతి ఘివురియాకు ముగ్గురు సంతానం. ఆదివాసీ తెగకు చెందిన రాయిమతి ఘివురియా వ్యవసాయంపై ఆసక్తితో కుటుంబ సభ్యుల సహకారంతో సేంద్రియ వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. ముందు వరి పంట సాగు చేసిన రాయిమతి ఘివురియా తర్వాత తృణధాన్యాలు పండించడంపై దృష్టి పెట్టారు. ఈ విధంగా ఇప్పటివరకు 72 స్వదేశీ వరి వంగడాలు, 30 రకాల తృణధాన్యాలను పండిస్తున్నారు. అంతే కాకుండా సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ దాదాపు 2500 రైతులను కూడా సేంద్రీయ వ్యవసాయంలోకి తీసుకొచ్చేలా చేశారు.
సంప్రదాయ పద్ధతుల్లో తృణ ధాన్యాలు పండించడంతో పాటు మరిన్న అంశాలపై రైతులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు 2012 లో తన సొంత భూమిలోనే ఓ ఫామ్ స్కూల్ను రాయిమతి ఘివురియా మొదలు పెట్టారు. ఇందులో స్థానికంగా ఉండే ఆదివాసీ రైతుల నుంచి తృణధాన్యాలు తీసుకుని.. వాటిని కనీస ధరకు విక్రయించడం కోసం సొంతంగా ఓ కంపెనీని కూడా ప్రారంభించారు. దీంతో ఆమె చేసిన కృషిని గుర్తించి ఇప్పటికే పలు అవార్డులు వచ్చాయి. తాజాగా జీ 20 సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం అందడంతో రాయిమతి సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు అదృష్టమని.. తృణధాన్యాల సాగుతో తన లాంటి ఎంతో మంది ఆదివాసీ మహిళల జీవితాలు ఏ విధంగా మారిపోయాయే తాను వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులకు వివరిస్తానని రాయిమతి పేర్కొన్నారు. సంప్రదాయ పద్ధతుల్లో పండించిన తృణధాన్యాలను కూడా ఆ జీ 20 సదస్సులో ప్రదర్శిస్తానని ఆనందం వ్యక్తం చేశారు.
ఇక మరో మహిళ సుబాశ మొహంత కూడా ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా సింగార్పుర్ గ్రామంలోని ఆదివాసీ తెగకు చెందిన నిరుపేద మహిళ రైతు. ఒకప్పుడు వరి సాగు చేసిన సుబాశ మొహంతకు ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో కొన్నేళ్ల పాటు వ్యవసాయంలో భారీగా నష్టం వచ్చింది. ఒక దశలో వ్యవసాయాన్ని వదిలేద్దాం అనుకున్న తరుణంలో ఒడిశా ప్రభుత్వం మిల్లెట్స్ మిషన్ తీసుకొచ్చింది. దీంతో ముందుగా ఒక ఎకరం భూమిలో సేంద్రియ పద్ధతుల్లో రాగులను పండించారు. మంచి దిగుబడి రావడంతో ఆమె ఇక వెనక్కి తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో సుబాశ మొహంత ప్రస్తుతం 8 ఎకరాల్లో రాగులు పండిస్తున్నారు. వీటితోపాటు తృణధాన్యాల సాగుపై స్థానికులకు కూడా ప్రోత్సాహం అందిస్తున్నారు.
ఈ ఏడాది మార్చిలో తృణధాన్యాలపై జరిగిన ప్రపంచ సదస్సులో సుబాశ మొహంత పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఆమెకు కొంతసేపు సమయం దొరికింది. తాజాగా జీ 20 సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం రావడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా గుర్తించింది. ఈ క్రమంలోనే జీ 20 సదస్సులో కూడా మిల్లెట్స్కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. ఇందులో భాగంగానే సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చే జీ 20 దేశాధినేతలతోపాటు విదేశీ అతిథులకు తృణధాన్యాలతో విందును, మిల్లెట్స్ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa