ప్రతిష్ఠాత్మక జీ 20 సమావేశాలకు ముందు భారత్ పేరు మార్చుతున్నారన్న ఊహాగానాలు, వార్తలు దేశంలో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. జీ 20 దేశాధినేతలకు ఇచ్చే విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రచురించడంతో ఈ అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత రోజే ప్రధాని ఇండోనేషియా పర్యటనకు సంబంధించి ప్రకటనలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని ఉండటంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. దీనిపై అధికార బీజేపీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ.. తాజాగా చైనా కూడా స్పందించింది.
ఇప్పటికే ఇండియా పేరు భారత్గా మార్చుతున్నారన్న దానిపై దేశంలో తీవ్ర చర్చ జరుగుతుండగానే చైనా తనదైన రీతిలో అక్కసును బయటపెట్టింది. అంతర్జాతీయంగా తన ప్రభావాన్ని పెంచుకునేందుకు జీ 20 వేదికను భారత్ అవకాశంగా మార్చుకోవాలని చూస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగానే భారత అంతర్గత విషయాల్లోకి జోక్యం చేసుకుంటూ.. తనకు అనవసరమైన వ్యాఖ్యలను చేసింది. దేశంపేరు మార్పు కంటే దేశంలో ఉన్న ఇతర ముఖ్య విషయాలపై దృష్టి సారించాలని చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ తాజాగా ప్రచురించిన కథనంలో తెలిపింది. స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను భారత్ సంస్కరణల మార్గంలో నడిపించగలదా అన్నదే అత్యంత ముఖ్యమైందని ఈ కథనంలో పేర్కొంది.
విప్లవాత్మక సంస్కరణలు లేకుండా భారత్ గణనీయమైన అభివృద్ధిని సాధించలేదని.. అయితే అంతర్జాతీయ పెరుగుతున్న దృష్టిని సద్వినియోగం చేసుకొని.. భారత్ అభివృద్ధికి చోదక శక్తిగా మార్చుకోగలదని ఆకాంక్షిస్తున్నామని తెలిపింది. ఇలాంటి సమయంలో జరుగుతున్న జీ 20 సదస్సులో ప్రపంచానికి భారత్ ఏం చెప్పాలనుకుంటోందని ఆరోపించింది. కేవలం వలసవాదంగా భావిస్తున్న పేరును తొలగించే ప్రయత్నంగా కనిపిస్తోందని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. భారత్లో ఆర్థిక సంస్కరణలకు సంబంధించి 1991 నుంచి చూస్తే ప్రస్తుతం ఉన్న మోదీ ప్రభుత్వం ఎంతో కీలకమని భావిస్తున్నప్పటికీ.. దురదృష్టవశాత్తు భారత్ మాత్రం వాణిజ్య రక్షణ వాదంవైపు వేగంగా అడుగులు వేస్తుండటం గమనార్హం. దేశం పేరు మార్చాలా వద్దా అనే విషయం కంటే ఈ విషయాలే ఎంతో ముఖ్యమైన అంశాలని చైనా మీడియా పేర్కొంది. ఇక ఇటీవల చైనా కంపెనీలపై భారత్ ఆంక్షలు విధించడాన్ని ప్రస్తావించిన గ్లోబల్ టైమ్స్.. భారత్ తన అసంతృప్తిని అంతర్జాతీయ మార్కెట్లకు బహిరంగంగా తెలుపుతోందని పేర్కొంది. జీ 20 సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న భారత్.. ఆర్థిక సంస్కరణలపై దృఢ సంకల్పాన్ని తెలియజేసేందుకు ఈ వేదికను వాడుకోవాలని చైనా సూచనలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa