ప్రకృతి ప్రకోపం ధాటికి ఆఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన ఈ భూకంపం ధాటికి వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయాల పాలయ్యారు. గాయపడిన వారి పరిస్థితి తీవ్ర విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత బాగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మొరాకో వీధుల్లో ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. కూలిపోయిన భవనాలు, అవయవాలు తెగిపడిన జనం, మృతులతో భయంకరమైన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఈ భూకంపం ధాటికి చారిత్రక కట్టడాలు దెబ్బతిన్నాయని.. పాక్షికంగా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.
మొరాకోలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మర్రాకేశ్కు నైరుతి దిశగా 71 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం రాత్రి ఈ పెను విపత్తు సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి అల్ హౌజ్, మర్రాకేశ్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రాంతాలు వణికిపోయాయని తెలిపింది. దీంతో చాలా భవనాలు నేలమట్టం అయ్యాయని తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో భవనాలు కదిలాయని.. దీంతో అందులో ఉన్న ప్రజలు.. కేకలు, ఆర్తనాదాలతో బయటకు పరుగులు తీశారని స్థానికులు చెప్పారు. ఆ సమయంలోనే కరెంట్ కూడా పోవడంతో చిమ్మచీకట్లో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
భూకంపం సంభవించినపుడు భూమి కంపిస్తున్నపుడు తాను నిద్రలో ఉన్నానని.. అప్పుడు గాల్లోకి ఎగిరిపోయినట్లు అనిపించిందని మరో వ్యక్తి చెప్పాడు. వెంటనే నిద్రలో నుంచి లేచి ఇంటి బయటికి పరిగెత్తినట్లు తెలిపారు. ఆ ప్రాంతమంతా ఏడుపులు, కేకలు, ఆర్తనాదాలతో నిండిపోయిందని మర్రాకేశ్ స్థానికులు వాపోయారు. దాంతో ప్రభావిత ప్రాంత ప్రజలంతా రాత్రి ఆరు బయటే ఉండిపోయారు. ఇక ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తు చేసుకున్నారు.
మరోవైపు.. తీవ్ర గాయాలతో వస్తున్న వారితో సమీపంలో ఉన్న ఆస్పత్రులు మొత్తం నిండిపోయాయి. మొరాకోలో ఇలాంటి ప్రకృతి విపత్తు గతంలో ఎన్నడు చూడలేదని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రకంపనల ధాటికి పక్కనే ఉన్న అల్జీరియాలో కూడా భూమి కనిపించినట్లు తెలిసింది. అయితే అక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అల్జీరియా అధికారులు స్పష్టం చేశారు. 1980 లో అల్జీరియాలో 7.3 తీవ్రతతో తీవ్ర భూకంపం సంభవించింది. ఆ ఘోర విపత్తులో 2500 మంది మరణించగా.. 3 లక్షల మంది నిరాశ్రయలుగా మారారు.
ఇక మొరాకోలో సంభవించిన భూకంపంపై ప్రధాని మోదీ.. స్పందించారు. ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ కఠిన సమయంలో మొరాకో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. మొరాకోకు సమష్టిగా సాయం చేయాలని జీ20 ప్రారంభ ఉపన్యాసంలో కూడా మోదీ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa