భారత్లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశంలో వివిధ దేశాధినేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వివిధ అంశాలపై ఢిల్లీ డిక్లరేషన్కు జీ20 సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. ఇందులో ఉక్రెయిన్ - రష్యా యుద్ధానికి సంబంధించిన కూడా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఢిల్లీ డిక్లరేషన్కు జీ 20 సభ్యదేశాలు అన్నీ ఆమోదం తెలిపాయి. కానీ ఈ ఢిల్లీ డిక్లరేషన్లో ఉక్రెయిన్ యుద్ధం అంశంపై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమపై ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్న రష్యా గురించి ఒక్క ప్రస్తావన కూడా లేకుండా తీర్మానం ఆమోదించడం సరైంది కాదని అభిప్రాయపడింది.
భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న జీ 20 శిఖరాగ్ర సదస్సులో తొలి రోజు విజయవంతంగా పూర్తయింది. ఇందులో భాగంగా భారత్ ప్రతిపాదించిన ఢిల్లీ డిక్లరేషన్ను జీ20 దేశాధినేతలు ఆమోదించారు. దీనిపై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒలెగ్ నికోలెంకో ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. భారత్ ప్రతిపాదించిన ఢిల్లీ డిక్లరేషన్లో ఎక్కడా రష్యా పేరును ప్రస్తావించలేదని పేర్కొన్నారు. అలా డాక్యుమెంటేషన్ చేసి ఆమోదం పొందడంలో గొప్ప ఏముందని ఒలెగ్ నికోలెంకో ప్రశ్నించారు.
పదాల అమరిక విషయంలో నేర్పును కనబరచి సమావేశాల్లో ఉక్రెయిన్ ప్రస్తావన తీసుకొచ్చినందుకు జీ20 భాగస్వామ్య దేశాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ జీ20 సమావేశాల్లో పాల్గొనే అవకాశాన్ని ఉక్రెయిన్కు కూడా కల్పించి.. ఉక్రెయిన్లో జరుగుతున్న పరిణామాలు, అక్కడి పరిస్థితులను జీ20 దేశాధినేతల కళ్లకు కట్టేవాళ్లమని తెలిపారు. ఢిల్లీ డిక్లరేషన్లో పేర్కొన్న విషయాలను వాస్తవంగా చెప్పి ఉండాల్సిందన్నారు. ఈ క్రమంలోనే డిక్లరేషన్ను సవరించి ఇలా చేస్తే మరింత అర్ధవంతంగానూ వాస్తవానికి దగ్గరగానూ ఉండేదని చెబుతూ ఆ సవరించిన డిక్లరేషన్ను విడుదల చేశారు.
ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి ఢిల్లీ డిక్లరేషన్లో ఈ అంశాలు పొందుపరిచారు. ఐక్యరాజ్యసమితి ఛార్టర్కు అనుగుణంగా ఏదైనా ప్రాదేశిక సమగ్ర, సార్వభౌమత్వానికి, రాజకీయ స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ప్రాదేశిక దురాక్రమణలకు దూరంగా ఉండాలని పేర్కొంది. అణ్వాయుధాలను చూపి బెదిరించడాన్ని ఏ మాత్రం ఆమోదించమని వెల్లడించింది. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా ప్రజలపై అదనంగా వచ్చి పడిన ఆహార, ఇంధన సంక్షోభాలు, పంపిణీ వ్యవస్థల ఛిన్నాభిన్నం, ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణం వంటివి ఆయా దేశాల పాలనను కష్టతరం చేస్తున్నాయని తీర్మానం అభిప్రాయపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa