విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. కనకదుర్గమ్మ ఆలయంలోని కేశ ఖండన శాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో అక్కడ భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే కొండ చరియలు విరిగిపడి నాలుగు బైకులు ధ్వంసమయ్యాయి.
ఈ ప్రమాదం నుంచి తూర్పుగోదావరి జిల్లాకు చెంందిన సురేష్ అనే భక్తుడు నిమిషాల వ్యవధిలో తప్పించుకున్నాడు. అమ్మవారి దర్శనానికి వచ్చిన సురేష్ ఈరోజు ఉదయం 10 గంటలకు తన బైక్ని పార్కింగ్ ప్లేస్ పార్క్ చేసి కేశ ఖండన శాలకు వెళ్లాడు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత కొండ చరియలు విరిగిపడి అతడి బైక్తో పాటు అక్కడే పార్క్ చేసిన మరో మూడు బైకులు ధ్వంసమయ్యాయి. 5 నిమిషాల వ్యవధిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో సురేష్ ఊపిరి పీల్చుకున్నాడు.
దీంతో జాతీయ రహదారి పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దుర్గ గుడి అధికారులు ప్రత్యేక క్రేన్లు తెప్పించి రోడ్డుపై పడిన కొండ రాళ్లను తొలగిస్తున్నారు. సమీపంలోని సబ్వేను కూడా మూసివేశారు. విరిగిపడిన కొండచరియలను తొలగించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు మొదలుపెట్టారు. దుర్గ గుడి ఈవో భ్రమరాంబ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే ఆలయం ముందు నుంచి వెళ్లే కుమ్మరిపాలెం - రథం సెంటర్ మధ్య రోడ్డు తాత్కాలికంగా మూసివేశారు. కొండరాళ్లు పూర్తిగా తొలగిస్తే తప్ప ట్రాఫిక్ పునరుద్ధరణ సాధ్యపడదని పోలీసులు అంటున్నారు. వాహనాల రాకపోకలను కనకదుర్గ పైవంతెన నుంచి కొనసాగిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa