ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు భద్రతపై జైళ్ల డీజీ లేఖ ,,,కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 12, 2023, 07:20 PM

రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు భద్రత కోసం తీసుకున్న చర్యలపై హోం శాఖ ముఖ్య కార్యదర్సి, జైళ్ల శాఖ డీజీ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న హరీష్ కుమార్ గుప్తా లేఖ రాశారు. దీనిని సీఐడీ తరఫు లాయర్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు ముందు ఉంచారు. హోంశాఖ ముఖ్య కార్యదర్సి లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. చంద్రబాబుకి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ప్రత్యేక భద్రత ఉందన్నారు.


చంద్రబాబు కోసం‌ ప్రత్యేకంగా ఒక వార్డులో ప్రత్యేక గది కేటాయించామని.. ఆ ప్రాంతంలో శానిటైజ్ చేసి జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. చంద్రబాబు ప్రత్యేక వార్డు వద్ద భద్రత కోసం ఆర్మ్‌డ్ గార్డులని ఏర్పాటు చేశామని.. ప్రత్యేక వార్డు వద్దకి ఎవరికీ అనుమతి లేదన్నారు. చంద్రబాబు అనుమతి, కోరిన వారికి మాత్రమే నిబంధనల మేరకు అనుమతి ఇస్తున్నామన్నారు. చంద్రబాబు గది ప్రత్యేకంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండిండెంట్ 24/7 పర్యవేక్షిస్తున్నారన్నారు. చంద్రబాబుకి నిరంతర వైద్య సదుపాయం అందుబాటులో ఉందని.. వైద్యులు అందుబాటులో ఉన్నారన్నారు.


ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైల్లో అన్ని రకాల వసతులతో కూడిన స్పెషల్ వార్డు కేటాయించామన్నారు. చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్‌కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు చెప్పారు. స్పెషల్ బ్లాక్ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆ లేఖలో తెలిపారు. ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశించినట్టే అన్ని వసతులు కల్పించామన్నారు. భద్రత దృష్ట్యా బ్లాక్‌ అన్ని వైపులా బలగాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ వార్డుల్లోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని.. ఎవరూ ప్రవేశించాలన్నా.. ప్రత్యేక అనుమతులు అవసరం అన్నారు. చంద్రబాబు అనుమతితోనే ములాఖత్‌కు అనుమతిస్తామన్నారు. రాజమండ్రి సూపరింటెండెంట్‌ సహా అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.


టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన హౌస్ రిమాండ్ పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈరోజు మధ్యాహ్నం తుది తీర్పును వెల్లడించనుంది. చంద్రబాబు హౌస్ రిమాండ్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాదులు కోరారు. అయితే చంద్రబాబుకు హౌస్ రిమాండ్‌ను సీఐడీ తరఫు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరుపక్షాలు సోమవారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపించగా.. నేడు తీర్పును వెల్లడించనున్నారు. మరోవైపు చంద్రబాబు రిమాండ్‌ను ఛాలెంజ్‌ చేస్తూ హైకోర్టులో ఆయన తరఫు లాయర్ మెన్షన్‌ చేయగా.. కోర్టు అనుమతించింది. రిమాండ్ చెల్లదంటూ దమ్మాలపాటి శ్రీనివాస్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa