మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును రిమాండ్కు పంపుతూ విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలపై సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విచిత్రంగా ఇప్పటి వరకు చంద్రబాబు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. పోలీసులు ఏ వ్యక్తినైనా నాన్ బెయిలబుల్ నేరం కింద అరెస్ట్ చేస్తే.. అరెస్టు చేసిన వ్యక్తికి సంబంధించిన న్యాయవాదులు మొట్టమొదటిగా చేయాల్సింది సంబంధిత కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు కోర్టు పోలీసుల రిమాండ్ అప్లికేషన్తో పాటుగా అరెస్టైన వ్యక్తి బెయిల్ పిటిషన్పై కూడా వాదనల్ని వింటుంది అన్నారు. అప్పుడు కోర్టు అరెస్టు చేసిన వ్యక్తిని రిమాండ్కు పంపడం.. లేని పక్షంలో పోలీసుల జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వడం.. లేకపోతే బెయిల్ మంజూరు చేయడం వంటి తగిన ఉత్తర్వులను జారీ చేస్తుంది అన్నారు.
చంద్రబాబును సెప్టెంబర్ 9న ఉదయం అరెస్ట్ చేసిన విషయాన్ని నాగేశ్వరరావు గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్ట్ మెమో ప్రకారం కోర్టు నుంచి బెయిల్ కోరవచ్చు అని స్పష్టంగా పేర్కొన్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తరఫున లాయర్లు అదే రోజున (9-9-2023) బెయిల్ కోసం ఏసీబీ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉంటే బావుండేది అన్నారు. కానీ వారు అలా చేయలేదని.. దానికి బదులుగా, వారు చంద్రబాబు రిమాండ్కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారని గుర్తు చేశారు. డిఫెన్స్ న్యాయవాది అరెస్టు చేసిన వ్యక్తి బెయిల్ కోసం దరఖాస్తు చేయనప్పుడు.. పోలీసు రిమాండ్కు వ్యతిరేకంగా మాత్రమే వాదించినప్పుడు.. డిఫెన్స్ న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవిస్తే, అరెస్టు చేసిన వ్యక్తిని జైలులో ఉంచడానికి జ్యుడీషియల్ కస్టడీకి పంపుతుందన్నారు. ఇక్కడ డిఫెన్స్ న్యాయవాదులు బెయిల్ కోసం అడగని పక్షంలో.. కోర్టు అడగని విషయాన్ని మంజూరు చేయదు కదా అన్నారు. చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ కోసం దరఖాస్తు చేయకపోవడంతోనే ఆయన్ను జైలుకు పంపారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజయవాడలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో బెయిల్ దరఖాస్తును దాఖలు చేసి ఉంటే.. ఒకవేళ అది తిరస్కరించి ఉంటే.. సోమవారం రోజు (11-9-2023) AP హైకోర్టులో అప్పీల్కు వెళ్లే అవకాశం ఉండేది అన్నారు.
తాను అర్థం చేసుకున్నట్లుగా.. సోమవారం (11-9-2023) కూడా విజయవాడలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో దాఖలు చేయలేదని.. దానికి బదులుగా జైలు కస్టడీకి బదులుగా చంద్రబాబు హౌస్ కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేశారన్నారు. అంటే చంద్రబాబు బెయిల్పై విడుదల కావడం వారికి ఇష్టం లేదా? అంటూ ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే తనకు చాలా విచిత్రంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలపై నాగేశ్వరరావు మూడు రోజులుగా స్పందిస్తున్నారు. ఈ కేసులో తన అభిప్రాయాలను చెప్పుకొస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa